Viral Video: దేవీ నవరాత్రుల సందర్బంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గార్బా డ్యాన్స్ చేస్తూ ఓ యువకుడు కుప్పకూలాడు. గుండెపోటుతో మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారం రాత్రి గుజరాత్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుజరాత్ రాష్ట్రంలోని ఆనంద్ జిల్లా తారాపూర్కు చెందిన శివ్ శక్తి సొసైటి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి నవరాత్రి వేడుకలు జరిగాయి. సదరు సొసైటి గ్రామంలో గార్బా డ్యాన్స్ ప్రొగ్రామ్ను ఏర్పాటు చేసింది. ఇందులో ఆడ,మగ.. పిల్ల, పెద్ద అని తేడా లేకుండా ఆసక్తి ఉన్నవారంతా పాల్గొన్నారు.
21 ఏళ్ల వీరేంద్ర సింగ్ రమేష్ భాయ్ రాజ్పుత్ కూడా ఆ డ్యాన్స్ ప్రొగ్రామ్లో పాల్గొన్నాడు. ఎంతో ఉత్సాహంగా అందరితో పాటు డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు. ఓ రెండు, మూడు నిమిషాలు డ్యాన్స్ చేసిన తర్వాత వీరేంద్ర ఉన్నట్టుండి నేలపై కుప్పకూలాడు. అతడు ఉన్నట్టుండలా కుప్పకూలేసరికి అక్కడివారికి ఏం జరిగిందో అర్థంకాలేదు. వెంటనే వీరేంద్ర స్నేహితులు అతడ్ని ఆసుపత్రికి తరలించారు. వీరేంద్రను పరీక్షించిన వైద్యులు అతడు అప్పటికే మృతి చెందినట్లు ద్రువీకరించారు. గుండెపోటు కారణంగా మృతి చెందినట్లు తేల్చారు.
ఇక, వీరేంద్ర మృతితో అతడి కుటుంబంతో పాటు గ్రామంలోనూ విషాదం చోటుచేసుకుంది. చేతికంది వచ్చిన కొడుకలా చిన్న వయసులోనే చనిపోవటంతో అతడి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. చిన్న కొడుకు మృతిని జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ ఈ మధ్య కాలంలో ఇలాంటి మరణాలు ఎక్కువయిపోయాయి’’.. ‘‘ పోస్ట్ కోవిడ్ సమస్యల కారణంగా గుండె పోట్లు మామూలైపోయాయి’’.. ‘‘యవ్వనంలో ఈ గుండెపోట్లు ఏంటో!’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
young age lo ee heart attacks ento 😱 pic.twitter.com/lPYXo0ND3p
— Kalyan Babu™ (@ram_aduri) October 3, 2022