పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన భారీ బడ్జెట్, పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్. 2023, సంక్రాతి పండుగ సందర్భంగా ఈ సినిమా విడుదల కానుంది. ఈ క్రమంలో దసరా పండుగ సందర్బంగా ఆదిపురుష్ సినిమా టీజర్ విడుదల చేశారు. దీనిపై ప్రభాస్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకోగా.. వాటిని తలకిందులు చేసింది టీజర్. అసలు సినిమాలో ప్రభాస్ రియల్గా నటించాడా.. లేక యానిమేషనా అన్నది అర్థం కాలేదు. ఇక రావణుడి గెటప్లో సైఫ్ అలీఖాన్ మీద విపరీతమైన విమర్శలు వచ్చాయి. మొత్తానికి ఈ టీజర్పై భారీ ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. డిస్లైక్ల విషయంలో కూడా రికార్డు క్రియేట్ చేసింది. అయితే దర్శకుడు ఓం రౌత్ టీజర్పై వచ్చిన ట్రోలింగ్ మీద స్పందించాడు. ఇది యూట్యూబ్లో, సెల్ఫోన్లో చూడాల్సిన పిక్చర్ కాదు.. కేవలం బిగ్ స్క్రీన్ మీద మాత్రమే దాని రేంజ్ అర్థం అవుతుంది అన్నాడు.
కానీ ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం.. టీజర్పై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ప్రభాస్ కెరీర్ను నాశనం చేయడానికే ఇలాంటి సినిమాలు తీస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు.. ఆదిపురుష్ టీజర్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ట్రోల్స్పై కూడా స్పందించాడు. ట్రోలర్స్ నేపథ్యంలో గురువారం ఆదిపురుష్ టీం.. మీడియా కోసం హైదరాబాద్లోని ఏఎంబీ సినిమాస్లో3డీ టీజర్ను ప్రదర్శించింది. దీనికి దిల్ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్లో దిల్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ.. ‘‘‘ఆదిపురుష్’ లాంటి సినిమాలను ఎక్స్పీరియన్స్ చేయాలంటే బిగ్ స్క్రీన్ మీదనే సాధ్యం.. సెల్ఫోన్లోనో, ఇంకా ఎక్కడో చూసి సినిమాను ఓ అంచనా వేయలేం. వీఎఫ్ఎక్స్ సినిమాలు వచ్చినప్పుడు థియేటర్లో.. జనాల మధ్య చూస్తేనే దాన్ని బాగా ఎంజాయ్ చేయగలం. ‘ఆదిపురుష్’ కూడా అలాంటి సినిమా. జనవరి 12న ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని ఇప్పటికే ప్రభాస్తో పాటు దర్శక నిర్మాతలకు చెప్పాను’’ అన్నారు.
‘‘టీజర్ను ఫోన్లో చూసి ఇంటికెళ్లి 65 ఇంచుల టీవీలో కూడా చూశాను. అదే ఫీలింగ్ కలిగింది. ఈరోజు థియేటర్కు వచ్చి 3డీలో చూశాను. ఇంకా ఎక్కువ థ్రిల్ ఫీలయ్యాను. బిగ్ స్క్రీన్ మీద చూసేటప్పుడు విజువల్స్ వచ్చి మీద పడుతుంటే విజిల్స్ వేశా. ‘ఆదిపురుష్’ ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా. ఈ సినిమా కథ కూడా రామాయణంలోని ఒక ఎపిసోడ్ను మాత్రమే తీసుకొని నేటి ప్రేక్షకులకు కొత్తగా చూపించాలని ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై కూడా చాలా చర్చ.. రావణుడు ఇలా ఉంటాడా.. పక్షి మీద ఎందుకొస్తాడు.. రథం మీద రావాలి కదా అని. ఈ సినిమా బృందం ఆదిపురుష్ సినిమా ద్వారా ఈ తరం ప్రేక్షకులుకు ఏం చూపించాలి అని ఓ ప్రయోగం చేశారు. దీని బ్యాక్ స్టోరీ నాకు కొంచెం తెలుసు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 12న పెద్ద సక్సెస్ కాబోతోంది. దానిలో ఒక్క శాతం కూడా అనుమానం లేదు’’ అని దిల్ రాజు విశ్వాసం వ్యక్తం చేశాడు.
అంతేకాక గతంలో బాహుబలి రిలీజ్ సందర్భంగా కూడా ఇదే రేంజ్లో ట్రోలింగ్ చేశారని గుర్తు చేశాడు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ.. ‘‘‘బాహుబలి పార్ట్ 1 షోని రాత్రి 12 గంటలకు శ్రీరాములు థియేటర్లో చూశాం. సినిమా చూసి బయటికి రాగానే ఇప్పటిలానే భారీ ఎత్తున ట్రోలింగ్ చేశారు. సినిమాలో ప్రభాస్ శివలింగాన్ని ఎత్తుకునే సీన్లో.. లింగానికి బదులు జండూబామ్ పెట్టి మొదటి రెండు రోజులు ట్రోల్ చేశారు. కానీ, సినిమా చూసిన రోజు రాత్రే నేను ప్రభాస్కు ఫోన్ చేసి సినిమా సూపర్ హిట్ అని చెప్పాను. అందుకు డార్లింగ్.. లేదు భయ్యా అన్నాడు. నువ్వు తడిగుడ్డ వేసుకుని పడుకో సినిమా సూపర్ డూపర్ హిట్ అని చెప్పాను’’ అని గుర్తు చేశాడు.