‘‘ఈ రోజు అంకిత్ నా దగ్గరకు వచ్చి.. మాట్లాడాలి పక్కకు రమ్మన్నాడు. వెళ్లాను. ఓ గెస్ట్ 10 వేల రూపాయలు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు.. అతడికి ప్రత్యేక సేవలు కావాలి.. నువు రెడీనా అన్నాడు. అంకిత్ ఏ ఉద్దేశంతో చెప్తున్నాడో నాకు అర్థం అయ్యింది. వెంటనే నేను పేదదాన్ని కావొచ్చు.. కానీ 10 వేల రూపాయల కోసం నన్ను నేను అమ్ముకోను అని కాస్త గట్టిగానే చెప్పాను. నా మాటలతో బెదిరినట్లే కనిపించాడు.. ఆ వెంటనే మాట మార్చాడు. నీ గురించి కాదు.. అలాంటి అమ్మాయిలు ఎవరైనా నీకు తెలిస్తే చెప్పు అన్నాడు. తను నా గురించే అలా అన్నాడని నాకు తెలుసు.. 10 వేల రూపాయలు అనగానే నేను అంగీకరిస్తాను అనుకున్నాడు. నా సమాధానంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మరోసారి అంకిత్ డైరెక్ట్గా ప్రత్యేక సేవలు అందిచడానికి రెడీగా లేకపోతే.. నీ స్థానంలో మరో అమ్మాయి ఉంటుంది అన్నాడు. వీరంతా నన్ను వేశ్యగా మార్చాలని చూస్తున్నారు’’ అంటూ స్నేహితుడికి చెప్పుకుని వాపోయింది అంకితా భండారి. ప్రస్తుతం ఆమె వాట్సాప్ చాట్ వైరలవుతోంది.
ఉత్తరాఖండ్ రిసార్ట్ రిసెప్షనిస్ట్ అంకిత భండారి హత్య కేసు దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రిసార్టుకు వచ్చే అతిథిలకు ప్రత్యేక సేవలు అందించడానికి నిరాకరించినందుకే అంకిత భండారిని హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యింది. వనతా రిసార్ట్కు వచ్చేవారితో శృంగారం చేయడాలని బాధితురాలిని ఆ రిసార్ట్ యజమాని పులకిత్ ఆర్య ఒత్తిడి చేశాడు. అందుకు ఆమె నిరాకరించడంతో.. హత్య చేసి ఉంటారని తేలింది. ఈ క్రమంలో బాధితురాలు హత్య గావించబడటానికి ముందు.. రిసార్ట్ యజమాని తనను వ్యభిచార కూపంలోకి లాగేందుకు ప్రయత్నిస్తున్నాడంటూ వాట్సాప్ చాట్లో స్నేహితుడికి చెప్పుకుని వాపోయింది. ఈ విషయం తాజాగా బయటకు వచ్చింది.
ఇక రిసార్ట్లో రిసెప్షనిస్ట్గా పని చేస్తున్న అంకిత భండారి హోటల్ మేనేజ్మెంట్ కోర్సు కోసం డెహ్రాడూన్కు వెళ్లింది. కుటుంబ పోషణ కోసం ఉద్యోగం వెతుక్కుంటూ రూ.10,000 జీతం కోసం రిసార్ట్లో రిసెప్షనిస్ట్గా మారింది. అయితే ఉద్యోగంలో చేరి పట్టుమని నెల రోజుల కూడా గడవక ముందే దారుణ హత్యకు గురయ్యింది. ఈ క్రమంలో సెప్టెంబర్ 18నుంచి అకింత అదృశ్యమైందని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. 21న వారు కేసు నమోదు చేశారు. ఇక పోలీసులకు ఫిర్యాదు చేసిన ఐదు రోజుల తర్వాత అంకిత మృతదేహాన్ని పౌరీ గర్వాల్లోని నందాల్సన్ బెల్ట్లో గుర్తించారు పోలీసులు.
ఈ క్రమంలో పోలీసులు రిసార్ట్ యజమాని పులకిత్ ఆర్య, అసిస్టెంట్ మేనేజర్ అంకిత్ గుప్తా, మేనేజర్ సౌరవ్ భాస్కర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. పులకిత్ ఆర్య హరిద్వార్కు చెందిన బీజేపీ నాయకుడు, ఉత్తరాఖండ్ మతి కళా బోర్డు మాజీ ఛైర్మన్ వినోద్ ఆర్య కుమారుడు. ఇక పోలీసులు విచారణలో నిందితులు.. అంకితను కాలువలోకి తోసి హత్య చేసినట్లు అంగీకరించారు. ఇక కేసు దర్యాప్తులో భాగంగా అంకిత రిసార్ట్లో తనకు ఎదురవుతున్న ఇబ్బంది గురించి స్నేహితుడికి చెప్పుకున్న విషయాలు వెలుగులోకి వచ్చాయి.
వాటిల్లో అకింత..‘‘రిసార్ట్ యజమాని ఆర్య నన్ను ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించాడు. ఇక అతడి సహాయకుడు అంకిత్ నా దగ్గరకు వచ్చి.. 10 వేల రూపాయలు ఇచ్చేందుకు గెస్ట్ రెడీగా ఉన్నాడు. ‘ప్రత్యేక సేవలు’ అందించడానికి నువ్వు రెడీ అని నన్ను అడిగాను. నేను పేదదాన్నే కావచ్చు.. కానీ 10 వేల రూపాయల కోసం నన్ను నేను అమ్ముకోను అని సీరియస్గానే చెప్పాను. వెంటనే మాట మార్చి.. అలాంటి వారు ఎవరైనా నీకు తెలిస్తే చెప్పు అన్నాడు. ఆ తర్వాత ఓ కస్టమర్ తాగిన మైకంలో నన్ను కౌగిలించుకోవడానికి ప్రయత్నించాడు. మరోసారి అంకిత్ వచ్చి.. నువ్వు ‘ప్రత్యేక సేవలు’ అందించడానికి రెడీగా లేకపోతే.. నీ స్థానంలో మరో అమ్మాయి ఉంటుంది అని హెచ్చరించి వెళ్లాడు. వీళ్లంతా నన్ను వేశ్యగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. పైగా సమస్య పెద్దది కాకుండా ఉండటానికి.. నన్ను మౌనంగా ఉండమని బెదిరిస్తున్నారు’’ అని అంకితా తన స్నేహితుడికి చెప్పుకొని వాపోయింది. ప్రసుత్త ఈ మెసేజ్ స్క్రీన్ షాట్లు వైరలవుతున్నాయి.
అంతేకాక.. ఆమె కనిపించకుండా పోవడానికి ముందు రిసార్ట్లో మరో ఉద్యోగికి చేసిన కాల్ కూడా వైరల్గా మారింది. అంకిత సదరు ఉద్యోగికి కాల్ చేసి తన బ్యాగ్ తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టాలని కోరింది. బ్యాగ్ తీసుకుని ఆమె చెప్పిన చోటుకి వెళ్తే.. అక్కడ అంకిత లేదని సదరు ఉద్యోగి వెల్లడించారు. ఇక పోలీసులు స్క్రీన్ షాట్లలోని మెసేజ్లు అంకితకు సంబంధించినవేనని.. దీనిపై మరింత స్పష్టత కోసం ఫోరెన్సిక్ పరీక్షలు అవసరమని తెలిపారు.
మరోవైపు అంకిత హత్యపై స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు.. రోడ్ల మీదకు వచ్చి నిరసన తెలిపారు. అంతేకాక నిందితులు ప్రయాణిస్తున్న పోలీసు వాహనాన్ని మహిళలు అడ్డుకున్నారు. బాధితురాలు పని చేసిన రిసార్ట్పై రాళ్లు రువ్వి ధ్వంసం చేశారు. అంకిత హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి విచారం వ్యక్తం చేశారు. ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితులను వదిలిపెట్టబోమని తెలిపారు. మరి ఈ దారుణ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.