ఈ కాలంలోనూ వరకట్న వేధింపులు ఉన్నాయంటే నమ్ముతారా? ఆ వేధింపులు తట్టుకోలేక ఓ యువతి ఆత్మహత్యకు యత్నించింది అంటే నమ్మగలరా? రోజులు మారుతున్నా కొందరు మాత్రం ఇంకా మూర్ఖులుగా, మొండిగా ప్రవర్తిస్తూనే ఉన్నారు. కోరిన కట్నం తీసుకురాకపోతే ఇంటికొచ్చిన ఆడపిల్ల ఉసురు పోసుకుంటూనే ఉన్నారు. తాజాగా జరిగిన ఓ ఘటన ఇప్పటికీ వరకట్నం కోసం పీక్కు తినే రాబంధులు ఉన్నాయని నిరూపించింది. అత్తింటి వేధింపులు, అత్తమామలు పెట్టే టార్చర్ తట్టుకోలేక ఓ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఆత్మహత్యాయత్నానికి ముందే ఓ సెల్ఫీ వీడియో తీసి అసలు తాను ఎందుకు చనిపోవాలని అనుకుంటుందో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆ యువతి సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది.
స్థానికుల కథనం ప్రకారం.. ఖానాపురానికి చెందిన నసీమా- ఇబ్రహీం దంపతుల కుమార్తె నూర్జహాన్.. అదే గ్రామానికి చెందిన శరత్ అనే యువకుడిని ప్రేమించింది. శరత్ని వివాహం చేసుకున్న నూర్జహాన్.. హైదరాబాద్ లో ఫ్యామిలీ పెట్టారు. కొన్నాళ్లు అంతా బాగానే సాగింది. తర్వాత అత్తమామలు, ఆడబిడ్డ, ఆమె భర్త, శరత్ కలిసి నూర్జహాన్ను వేధించడం ప్రారంభించారు. పుట్టింటి నుంచి కట్నం తీసుకురావాలంటూ నూర్జహాన్ను వేధించడం ప్రారంభించారు. వరకట్న వేధింపుల విషయంపై ఊర్లో చాలా సార్లు పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ కూడా జరిగింది. కానీ శరత్ కుటుంబసభ్యుల్లో మార్పు రాలేదు. వారి వేధింపులు తాళలేక గీసుకొండ మండలం కోటగండి వద్ద యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. అంతకు ముందే ఓ సెల్ఫీ వీడియో రికార్డు చేసింది.
తన చావుకు భర్త, అత్తమామలు, ఆడబిడ్డ, ఆమె భర్తలే కారణం అంటూ చెప్పుకొచ్చింది. ప్రేమించి పెళ్లిచేసుకున్న తనని వరకట్నం కోసం చిత్రహింసలు పెట్టారంటూ వాపోయింది. పీఎస్ల చుట్టూ తిరిగినా కూడా తనకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేసింది. సీఐ సార్ కూడా డబ్బు తీసుకుని నాకు న్యాయం చేయలేదు అంటూ నూర్జహాన్ ఆరోపించింది. తనలాంటి పరిస్థితి మరే అమ్మాయికి రాకుండా చూడాలంటూ నూర్జహాన్ వేడుకుంది. కోటగండి వద్ద క్రిమిసంహారక మందు తాగి అపస్మారక స్థితిలో పడిఉన్న నూర్జహాన్ను స్థానికులు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు వెల్లడించారు. ఆత్మహత్యకు యత్నించడానికి ముందు రికార్డు చేసిన సెల్ఫీ వీడియో తెలిసిన వారికి వాట్సాప్ ద్వారా పంపించింది.