తిరుమల శ్రీవారి ఆలయం పైన డ్రోన్ కెమెరా ఎగరడం సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో టీటీడీ అధికారులు స్పందించారు. తిరుమల డోన్ వీడియోలపై టీటీడీ అధికారులు సీరియస్ అయ్యారు. తిరుమల ఆలయంపై డ్రోన్ వెళ్లడం అసాధ్యమని టీటీడీ అధికారులు వెల్లడించారు. నో ఫ్లయింగ్ జోన్ పై డ్రోన్ ఎలా వచ్చిందో ఆరా తీస్తున్నామని అన్నారు. సెక్యూరిటీ వైఫల్యాలపై కూడా ఆరా తీస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. ఇక టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. వీడియో అప్ లోడ్ చేసిన వ్యక్తిపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామని అన్నారు. రెండు, మూడు రోజుల్లో వాస్తవాలను భక్తుల ముందు ఉంచుతామని అన్నారు. దీనిపై అధికారులు విచారణ కొనగిస్తున్నారు.
తిరుమల శ్రీవారు కొలువైయున్న కొండ మీద నుంచి విమానాలు గానీ, హెలికాప్టర్ లు గానీ ఎగిరేందుకు అనుమతి లేదు. ఆ ఏరియాని నో ఫ్లయింగ్ జోన్ గా ఉంచారు. అయితే తిరుమల ఆలయానికి సంబంధించిన డ్రోన్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన విజువల్స్ డ్రోన్ షాట్స్.. ఐకాన్ అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ అవ్వగా. అది కాస్తా వైరల్ గా మారింది. కట్టుదిట్టమైన భద్రత ఉన్నా కూడా డ్రోన్ షాట్స్ ఎలా తీయగలిగారో అనేది అంతుపట్టకుండా ఉంది. అయితే ఈ వీడియో నవంబర్ లో అప్ లోడ్ చేసినట్లు అధికారులు గుర్తించారు. అయితే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ప్రాజెక్ట్ కోసం ఏరియల్ విజువల్స్ చిత్రీకరించినట్లు సమాచారం.
గత ఏడాది నవంబర్ లో కాకులకోన ఏరియాలో డ్రోన్ తో షూట్ చేసినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఆనంద నిలయం ఏరియల్ షాట్స్ కూడా డ్రోన్ తో చిత్రీకరించినట్లు చెబుతున్నారు. తిరుమల ఆలయానికి సంబంధించిన డ్రోన్ వీడియోని ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి తొలగించినట్లు అధికారులు వెల్లడించారు. కావాలనే టీటీడీపై దుష్ప్రచారం చేయాలన్న ఉద్దేశంతో చేస్తున్నారా? లేక వేరే కారణాలు ఉన్నాయా? భద్రతా వైఫల్యం వల్ల జరిగిందా? దీనికి గల కారణాలు రెండు, మూడు రోజుల్లో బయటపెడతామని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. మరి తిరుమల కొండపై డ్రోన్ వీడియో హల్చల్ చేయడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.