ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు మార్గం సుగమం చేశారు సీఎం జగన్. ఏపీలో పరిశ్రమలు స్థాపించాలనుకునే వారికి, పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చే వారికి ప్రభుత్వం అన్ని రకాల ప్రోత్సాహకాలు అందిస్తోంది. అలానే పరిశ్రమల స్థాపనకు వెంటనే అనుమతులు మంజూరు చేయడంతో పాటు వాటికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం, రాయితీలు ప్రకటించడం, బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించడం చేస్తున్నారు. అలానే పరిశ్రమల్లో స్థానికులకు ఎక్కువ ఉద్యోగాలు వచ్చేలా చర్యలు తీసుకుంటూ… పారిశ్రామిక అభివృద్ధికి దోహదం చేయడమే కాక ఉపాధి కల్పన దిశగా ముందుకు వెళ్తున్నారు. సీఎం జగన్ కృషి కారణంగా పారిశ్రామిక పెట్టుబడుల ఆకర్షణలో దేశంలోనే ఏపీ అగ్రస్థానంలో నిలిచింది. 2022, జూలై చివరి నాటికి భారతదేశానికి రూ.1,71,285 కోట్ల విలువైన పారిశ్రామిక పెట్టుబడులు రాగా.. 45 శాతం వాటాతో ఏపీ అగ్రస్థానంలో నిలిచింది.
భారీ పరిశ్రమలే కాక.. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థాపన, అభివృద్ధి కోసం సీఎం జగన్ వైఎస్సార్ నవోదయం పథకాన్ని తీసుకువచ్చారు. దీని ద్వారా సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమల స్థాపనను ప్రోత్సాహించడమే కాక.. వాటిని ఆర్థికంగా ఆదుకుంటున్నారు. రీస్టార్ట్ ప్యాకేజీల ద్వారా వాటికి రాయితీలు కల్పిస్తున్నారు. ఎంతో కాలంగా ఉన్న ప్రభుత్వ బకాయిలను కూడా చెల్లించారు. తక్కువ వడ్డీపై క్యాపిటల్ రుణాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఎస్సీ, ఎస్టీ, మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు అందజేస్తుంది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా ఏపీలో పరిశ్రమల స్థాపించేందుకు ముందుకు వస్తున్నారు పారిశ్రామికవేత్తలు.
ఈ క్రమంలో తాజాగా మరో గొప్ప పరిశ్రమ స్థాపనకు ఏపీ వేదికయ్యింది. దేశంలోనే మొట్టమొదటి లిథియం-అయాన్ బ్యాటరీ పరిశ్రమను ఏపీలో ఏర్పాటు చేశారు. తిరుపతిలోని ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్లో చెన్నైకి చెందిన మునోత్ ఇండస్ట్రీస్, భారతదేశపు మొట్టమొదటి లిథియం సెల్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. మునోత్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రూ. 165 కోట్లతో ఈ పరిశ్రమను ఏర్పాటు చేసింది. 2015లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన రెండు ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్లలో ఒక దాంట్లో లిథియం బ్యాటరీ కర్మాగారం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా భారతదేశపు మొట్టమొదటి లిథియం సెల్ తయారీ కర్మాగారంలో గడపడంపై కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సంతోషం వ్యక్తం చేశారు. 2025-26 నాటికి 300 బిలియన్ డాలర్ల విలువైన ఎలక్ట్రానిక్స్ తయారీ ఎగుమతుల లక్ష్యాన్ని సాధించగలదని చెప్పారు. తిరుపతిలో భారతదేశపు మొట్టమొదటి లిథియం సెల్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం పట్ల జనాలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ నిర్ణయాలతో ఏపీ సంక్షేమంతో పాటు అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది అంటూ జనాలు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.