దివంగత నటులు కృష్ణంరాజు పేరు మీద స్మృతివనం ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. కృష్ణంరాజు స్మృతివనం కోసం రెండెకరాల భూమిని కేటాయించాలని నిర్ణయించింది. కృష్ణంరాజు స్వగ్రామం అయిన మొగల్తూరులో సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. ఈ సంస్మరణ సభలో రోజా, కారుమూరి నాగేశ్వరరావు వంటి ఏపీ మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొని నివాళులు అర్పించారు. అనంతరం కృష్ణంరాజు కుటుంబ సభ్యులని పరామర్శించారు. కృష్ణంరాజు భౌతికంగా దూరమైనప్పటికీ.. మన మనస్సులో ఎప్పుడూ మనతోనే ఉంటారని మంత్రులు అన్నారు. రీల్ లైఫ్ లో ఆయన రెబల్ స్టార్, రియల్ లైఫ్ లో పీపుల్ స్టార్ అని అన్నారు. కృష్ణంరాజు సినీ పరిశ్రమకు చేసిన సేవలకు గాను ఆయన గుర్తుగా స్మృతివనం ఏర్పాటు చేస్తామని అన్నారు.
ఈ సందర్భంగా కృష్ణంరాజు స్మృతివనం కోసం రెండెకరాల భూమి కేటాయిస్తున్నట్లు ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వెల్లడించారు. కుటుంబ సభ్యులు కోరుకున్న చోట భూమి ఏపీ ప్రభుత్వం సిధ్దంగా ఉందని అన్నారు. నర్సాపురం పేరుపాలెం బీచ్ లో కృష్ణంరాజు స్మృతివనం ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీని కోసం ప్రభుత్వం రెండెకరాల భూమిని కేటాయించేందుకు సిద్ధమైంది. ఈ స్మృతివనంలో కృష్ణంరాజు విగ్రహంతో పాటు.. ఆయన వాడిన కాస్ట్యూమ్స్, సినిమా లైబ్రరీ, ఆడిటోరియం వంటివి కృష్ణంరాజు గుర్తుగా ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. ఏపీ ప్రభుత్వం చేసిన ప్రకటనతో రెబల్ స్టార్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణంరాజు స్మృతివనం ఏర్పాటు చేయడం కంటే గొప్ప నివాళి ఇంకేముంటుందని ప్రశంసిస్తున్నారు.