రెబల్ స్టార్, కేంద్రమాజి మంత్రి కృష్ణంరాజు సెప్టెంబర్ 11న మృతి చెందిన సంగతి తెలిసిందే. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గచ్చిబౌలిలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. కన్నుమూశారు. దశదిన కర్మను ఇక్కడే హైదరాబాద్లో పూర్తి చేశారు. ఇక నేడు పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులోని ఆయన స్వగృహంలో కృష్ణంరాజు సంస్మరణ సభ నిర్వహిస్తున్నారు. ఇందుకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు.. ఉభయగోదావరి జిల్లాల నుంచి సుమారు లక్ష మంది వరకు కృష్ణంరాజు, ప్రభాస్ అభిమానులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇప్పటికే కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి, కుమార్తెలు, ఇతర కుటుంబసభ్యులు మొగల్తూరుకు చేరుకున్నారు. ఇక ప్రభాస్ గురువారం మొగల్తూరు వెళ్లారు. ఇక సంస్మరణ సభకు వచ్చిన వారందరికీ ప్రభాస్, కృష్ణంరాజు కుటుంబ సభ్యులు కనిపించి అభివాదం చేసేలా ఏర్పాట్లు చేశారు. ముఖ్యఅతిథులకు ఆయన ఇంటి ఆవరణలో ఏర్పాట్లు చేశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు అధికార యంత్రాంగం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకొంటుంది.
ఇక సంస్మరణ సభకు వచ్చేవారందరికి భోజన ఏర్పాట్లు చేశారు. కృష్ణంరాజు ఎంతటి భోజన ప్రియుడో అందరికి తెలిసిన సంగతి. ఇక ఆయన ఇంటికి ఎవరైనా అతిథులు వెళ్తే.. రకరకాల ఆహార పదార్థాలతో బ్రహ్మండమైన విందు ఏర్పాటు చేస్తారని కృష్ణంరాజు గురించి ఇండస్ట్రీలో అందరూ చెప్పే మాట. అందుకే ఆయన సంస్మరణ సభ సందర్భంగా భారీ విందు ఏర్పాటు చేశారు ఆయన కుటుంబ సభ్యులు. ఏకంగా 50 రకాల వంటకాలతో భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. వీటిలో 25 రకాలు నాన్ వెజ్ కాగా.. మరో 25 రకాల్లో వెజ్, స్నాక్స్, స్వీట్లు ఇలా మిగతా ఆహార పదార్థాలున్నాయి.