టాలీవుడ్ లెజెండరీ యాక్టర్, మాజీ పార్లిమెంట్ సభ్యుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇటీవలే స్వర్గస్తులైన విషయం తెలిసిందే. 82 ఏళ్ళ వయసులో ఆరోగ్యం క్షీణించడంతో కృష్ణంరాజు తుదిశ్వాస విడిచారు. 1940లో మొగల్తూరులో పుట్టిన కృష్ణంరాజు సెప్టెంబర్ 11న హాస్పిటల్ చికిత్స పొందుతూ కన్నుమూశారు. అయితే.. తెలుగు చిత్రసీమలో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసి, ప్రేక్షకుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారు రెబల్ స్టార్. కెరీర్ పరంగా హిట్స్, సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్స్ ని చూసిన కృష్ణంరాజు.. ఇకలేరనే వార్తను.. వాస్తవాన్ని సినీ ప్రేక్షకులు, అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు.
ఈ క్రమంలో కృష్ణంరాజు మరణించి పదిరోజులు పూర్తి కావస్తోంది. దీంతో దివంగత కృష్ణంరాజు దశదిన కర్మ కోసం అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో ఆయన వ్యాక్స్ విగ్రహం(మైనపు బొమ్మ)ను సిద్ధం చేశారు. భౌతికంగా కృష్ణంరాజు ఈ లోకంలో లేకపోయినా.. ఆయన జ్ఞాపకాలను పదిలంగా దాచుకునే ఉద్దేశంతో కుటుంబ సభ్యులు ఈ మైనపు బొమ్మను చేయించాలని భావించారు. ఈ నేపథ్యంలో కొత్తపేటలోని ప్రముఖ శిల్పి రాజ్ కుమార్ వడయార్ ని సంప్రదించడంతో ఆయన కృష్ణంరాజు విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది. కేవలం నాలుగు రోజుల్లోనే కృష్ణంరాజు మైనపు బొమ్మను తయారు చేసినట్లు వడయార్ తెలిపారు.
ఇదిలా ఉండగా.. కృష్ణంరాజు దశదిన కార్యక్రమంలో శిల్పి రాజ్ కుమార్ వడయార్ ఈ విగ్రహాన్ని కుటుంబ సభ్యులకు అందజేయనున్నట్లు సమాచారం. ఈ నెల 23న జూబ్లీహిల్స్(హైదరాబాద్)లోని కృష్ణంరాజు స్వగృహంలో దశదిన కర్మను కుటుంబ సభ్యులు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా శిల్పి రాజ్ కుమార్ వడయార్ మాట్లాడుతూ.. తాను అభిమానించే నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజేనని, ఆయన మరణవార్త ఎంతో బాధ కలిగించిందని.. ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కోరిక మేరకు 4 రోజుల్లో ఈ విగ్రహాన్ని రెడీ చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం కృష్ణంరాజు వ్యాక్స్ విగ్రహానికి సంబంధించి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి దివంగత రెబల్ స్టార్ కృష్ణంరాజు గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.