కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి దేశంలో అనేక ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలి వస్తుంటారు. నిత్యం భక్తుల రద్దీ ఉంటుంది. ఈ కారణంగా భక్తులు స్వామి వారి దర్శనానికి గంటలు గంటలు వేచి ఉండాల్సి వస్తుంది. కొన్నిసార్లు 24 గంటలు పైనే వేచి ఉండాల్సి వస్తుంది. దీని వల్ల జనాలు నానా అవస్థలు పడుతున్నారు. వయోవృద్ధులు, పిల్లలతో వచ్చే వారి గురించి అయితే చెప్పాల్సిన పని లేదు. ఇలాంటి ఇబ్బందులన్నిటికీ చెక్ పెడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుండి సామాన్య భక్తులెవరూ క్యూలైన్లలో నిలబడాల్సిన పని లేదని చెబుతోంది.
దీని కోసం టీటీడీ ‘వర్చువల్ క్యూలైన్’ విధానాన్ని తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ వర్చువల్ క్యూలైన్ విధానం ద్వారా భక్తులు ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకునే ముందు అందులో ఉన్న టైమ్ స్లాట్స్ ని సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ పర్టిక్యులర్ టైమ్కి తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకోవచ్చు. ఇలా చేస్తే కేవలం రెండు గంటల్లోనే దర్శనం పూర్తి చేసుకుని వెళ్లొచ్చనని టీటీడీ అధికారులు అంటున్నారు. త్వరలోనే ఈ విధానాన్ని అమలులోకి తీసుకొస్తామని చెబుతున్నారు.
ప్రస్తుతం ఆన్లైన్లో అంగప్రదిక్షణ టోకెన్లు విక్రయిస్తుంది టీటీడీ. టిక్కెట్ల కొరకు క్యూలైన్లో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా.. ఆన్లైన్లోనే విక్రయిస్తూ వస్తుంది. వయోవృద్దులు, వికలాంగులకు జారీ చేసే ఆఫ్లైన్ టికెట్లు సైతం ఆన్లైన్లోనే విక్రయిస్తోంది. ఈ విధానం వల్ల టికెట్ల కోసం గంటల తరబడి క్యూలైన్లో నిలబడే పరిస్థితి తప్పింది. అయితే కరోనా ముందు వరకూ ఆఫ్లైన్లోనే టోకెన్ల విధానాన్ని అమలుచేసిన టీటీడీ, కరోనా తర్వాత ఆన్లైన్ టైం స్లాట్ దర్శన విధానాన్ని అమలుచేసింది. దీని వల్ల భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు రావడం, క్యూలైన్లో భారీగా తోపులాట జరగడంతో టైం స్లాట్ విధానాన్ని రద్దు చేసి మళ్ళీ పాత విధానాన్ని అమలుచేసింది టీటీడీ.
అయితే తాజాగా టీటీడీ తీసుకురానున్న వర్చువల్ క్యూ విధానం వల్ల.. తోపులాట ఉండదని టీటీడీ భావిస్తుంది. ఈ వర్చువల్ క్యూలైన్ విధానం వల్ల భక్తులు 10, 15 నిమిషాల ముందు తిరుమలకు చేరుకుంటే సరిపోతుందని, రెండు గంటల్లో దర్శనం అయిపోతుందని అంటున్నారు. అందుకే ఈ విధానాన్ని అమలు చేసేందుకు టీటీడీ క్షుణ్ణంగా అధ్యయనం చేస్తోంది. దీనికి కావాల్సిన ఏర్పాట్లను, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని భక్తులకు మరింత సౌకర్యం కల్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే సామన్యులకు ఇక ఇక్కట్లు తొలగినట్టే. మరి టీటీడీ తీసుకొస్తున్న ఈ వర్చువల్ క్యూలైన్ విధానంపై మీ అభిప్రాయమేంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Punganur Cow: ఈ ఆవు ఎత్తు మూడడుగులే.. కానీ, రైతులకు కాసుల వర్షం కురిపిస్తోంది!
ఇది కూడా చదవండి: వీడియో: మెతుకు మిగల్చకుండా తింటే.. రూ.10116 బహుమతి! ఎక్కడంటే!