అభివృద్ధి పేరుతో చాలా మంది పల్లెల్లో అడవులను నరికివేసి ప్లాట్లు, కంపెనీలను నిర్మిస్తున్నారు. దీంతో అడవుల్లో తిరిగే జంతువులైన పులులు, ఏనుగులు వంటి జంతువులు ఈ మధ్యకాలంలో రోడ్లపైకి, ఏకంగా గ్రామాల్లోకి వస్తున్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా చిరుత పులులు గ్రామాల్లోకి చొరబడి ఆవులను, గేదేలను చంపేసి పీక్కుతింటున్నాయి. ఇక వీటి రాకతో జనాలు కూడా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతకాల్సిన పరిస్థితి ఏర్పపడింది. మాములుగా మనం చిరుత పులిని దూరం నుంచి చేస్తేనే మనకు వెన్నులో వణుకు పుడుతుంది. అదే మన ఇంట్లోకి వస్తే ఎలా ఉంటుంది. కానీ గురువారం ముంబైలోని కళ్యాణ్ లో ఏకంగా ఆ చిరుత పులి అపార్ట్ మెంట్ లోకి చొరబడింది.
అందులోకి దూరడమే కాకుండా కొంతమంది తీవ్రంగా దాడి చేసి అక్కడి నుంచి మరో అపార్ట్ మెంట్ పైకి దూకింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న స్థానిక జనాలు పులిని చెదరగొట్టేందుకు వందల సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఇక వెంటనే అలెర్ట్ అయిన స్థానికులు కొందరు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం తెలుసుకున్న సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని పులిని పట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అక్కడికి వచ్చిన చాలా మంది దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. అది కాస్త వైరల్ గా మారింది.