సర్వేద్రియానం నయనం ప్రధానం అని పెద్దలు అన్నారు. శరీరంలోని అన్ని అవయవాల కంటే ప్రధానమైనవి కళ్లు. ఒక్క రెండు నిమిషాలు కళ్లు మూసుకుంటే మనం ఎక్కడికీ కదలలేం.. ఏ పనీ చేయలేము. ప్రపంచమంత చీకటిగా కనిపిస్తుంది. ఆ రెండు నిమిషాలేక ఎంతో అలాటిపోతాము. అయితే అసలు చూపు లేకపోతే ఏంటి పరిస్థితి. ఇక జీవితం దుర్భరం కదా?. కానీ ఆ అవయవ లోపం శరీరానికే కానీ మనస్సు కాదని, విజయాలకు వైకల్యాలు అడ్డురావని జనగామకి చెందిన యువతి నిరూపించింది. కళ్లు లేకపోయినా కష్టపడి చదివి బ్యాంకులో జాబ్ సాధించి ఎందరికో ఆదర్శంగా నిలిచింది.
జనగామ జిల్లా పాలకుర్తి మండలం లక్ష్మీనారాయణపురం గ్రామానికి చెందిన పోగు సుభద్ర, వెంకటేశ్వర్ల దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద అమ్మాయి పేరు హిమ బిందు. ఈమె పుట్టుకతోనే అంధురాలు. ఆడబిడ్డ పుడితేనే అసహ్యించుకుని పురిటిలోనే ప్రాణాలు తీసే తల్లిదండ్రుల్లా ఆమె కన్నవారు ఆలోచించలేదు. హిమ బిందువును బాగా చదవించాలని భావించారు. బిందు ఐదో తరగతి వరకు స్వగ్రామం లక్ష్మీనారాయణపురంలోనే చదువుకుంది. అనంతరం హైదరాబాద్ లోని మలక్పేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పూర్తిచేసింది. ఓ ప్రైవేట్ కాలేజిలో ఇంటర్ పూర్తి చేసి బిందు.. అనంతరం కోఠి ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ, పీజీని పూర్తి చేసింది. ఏదో ఒకటి సాధించి.. ఉన్నత స్థాయికి ఎదగాలని చిన్నతనం నుంచి బిందు లక్ష్యంగా పెట్టుకుంది.
ఈక్రమంలో పీజీ పూర్తికాగానే బ్యాంక్ ఉద్యోగం కోసం కష్టపడింది. ఐపీబీఎస్లో పీవో ఉద్యోగానికి ఇంటర్వ్యూ వరకు వెళ్లింది. అక్కడ విఫలమైనా కూడా బిందు నిరాశ చెందలేదు. ఆమె తల్లిదండ్రులు, టీచర్ల, స్నేహితులు కూడా ఎంతో ప్రోత్సహించారు. దీంతో మళ్లీ పూర్తిస్థాయిలో సాధన మొదలు పెట్టింది. తన శ్రమ ఫలించి 2021లో హిమబిందు ఏపీజీవీబీ లో ఉద్యోగం సాధించింది. ప్రస్తుతం ఆమె మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం నాంచారిమడూరు శాఖలో క్యాషియర్ గా పని చేస్తోంది. దీంతో ఆమె ఆ చుట్టుపక్కల వారికి ఆదర్శంగా నిలించింది. మరి.. కళ్లులేకపోయిన..సంకల్పంతో జాబ్ సాధించిన హిమబిందుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.