టీమిండియా యంగ్స్టర్ వెంకటేశ్ అయ్యర్ నడవలేని స్థితిలో ఉన్నాడు. ఎడమకాలికి పెద్ద కట్టుతో లెగ్ వాకర్ సహాయంతో నడుస్తున్నాడు. ఈ ఫొటోను ఐపీఎల్ ఫ్రాంచైజ్ కోల్కత్తా నైట్ రైడర్స్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్టు చేసింది. దీంతో అయ్యర్కు ఏమైందని క్రికెట్ అభిమానులు కంగారు పడుతున్నారు. కాగా.. ముస్తక్ అలీ ట్రోఫీ 2022లో భాగంగా వెంకటేశ్ అయ్యర్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతను ఈ టోర్నీకి పూర్తిగా దూరమయ్యాడు. అయ్యర్ కాలి గజ్జల్లో ఎముక చిట్లినట్లు తెలుస్తుంది. దీంతో అతనికి ఆరు వారాల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు నిర్ధారించారు. కాలికి చికిత్స తీసుకున్న అయ్యర్.. ఇంట్లో ఒక నెల పాటు విశ్రాంతి తీసుకోనున్నాడు.
ఇంట్లో నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకుని ఆ తర్వాత బెంగుళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి వెళ్లనున్నాడు. అక్కడే ఉండి కాలికి చికిత్స తీసుకోవడంతో పాటు తిరిగి ఫిట్నెస్ సాధించనున్నాడు. కాగా.. ఐపీఎల్ 2021 సీజన్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన వెంకటేశ్ అయ్యర్.. ఆల్రౌండర్గా టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. అదే సమయంలో ఆల్రౌండర్ హర్దిక్ పాండ్యా ఫామ్లేమి, గాయాలతో టీమిండియాలో స్థానం కోల్పోవడంతో అయ్యర్కు అవకాశాలు తలుపుతట్టాయి. కానీ.. అయ్యర్ ఆశించిన స్థాయిలో రాణించలేదు. దీంతో జట్టులో స్థానం కోల్పోయాడు. అలాగే ఐపీఎల్ 2022లో కూడా పెద్దగా రాణిందచలేదు.
కాగా.. ఇటివల ముగిసిన రంజీ ట్రోఫీలో వెంకటేశ్ అయ్యర్పై బౌలర్ దాడి చేసి గాయపర్చిన విషయం తెలిసిందే. ఆ గాయం నుంచి వెంటనే కోలుకున్న అయ్యర్.. రంజీతో పాటు ముస్తక్ అలీ ట్రోఫీలో మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడు. గతవారం మధ్యప్రదేశ్-రాజస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్లో 31 బంతుల్లోనే 5 ఫోర్లు, 4 సిక్సులతో 62 పరుగులు చేసి దుమ్మురేపాడు. అలాగే బౌలింగ్లోనూ సత్తా చాటి 6 వికెట్లు పడగొట్టి అదరగొట్టాడు. ఈ మ్యాచ్లో మధ్యప్రదేశ్ను ఒంటిచేత్తో గెలిపించాడు. కానీ.. ఇలా కాలికి గాయంతో టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. రెండు నెలల తర్వాత.. తిరిగి కోలుకుంటే.. ఇక అయ్యర్ మళ్లీ తిరిగి బరిలోకి దిగేది ఐపీఎల్లోనే అవుతుంది.