భారత్-ఆస్ట్రేలియా టీ20 సిరీస్ లో భాగంగా ఈ నెల 25న మ్యాచ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. ఈ నేపథ్యంలోనే మ్యాచ్ టికెట్ల కోసం అభిమానులు జింఖానా మైదానంలో పడిగాపులు కాస్తున్నారు. మెుదట ఉప్పల్ స్టేడియంలో టికెట్లు ఇస్తారు అంటే.. అక్కడికి వెళ్లిన అభిమానులకు నిరాశే ఎదురైంది. ఈ క్రమంలోనే జింఖానా గ్రౌండ్ టికెట్లు ఇస్తారని తెలియడంతో అక్కడికి వేల సంఖ్యలో అభిమానులు వచ్చారు. దాంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగారు. కానీ.., ఇంతలోనే అక్కడ ఊహించని విషాదం చోటు చేసుకుంది. ఆ వివరాలోకి వెళ్తే..
ఈ నెల 25 ఇండియా-ఆస్ట్రేలియా మధ్య 3వ టీ20 జరగనుంది. దీంతో టికెట్ల కోసం అభిమానులు పెద్ద ఎత్తున జింఖానా గ్రౌండ్ దగ్గరకు చేరుకున్నారు. దాదాపు ఒకేసారి 30 వేల మంది అభిమానులు అక్కడికి చేరుకోవడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. గేటు దగ్గర ఎక్కువ మంది చేరడంతో తోపులాటలో పలువురికి గాయాలు అయ్యాయి. అయితే.. వీరిలో ఒక మహిళ తీవ్రంగా గాయపడటంతో ఆమెని చికిత్స కోసం ఆస్ఫత్రికి తరలించారు.
ఈ ఘటనలో HCA వైఫల్యం కూడా ఉందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. నిజానికి ఈ మ్యాచ్ టికెట్లును సెప్టెంబరు 15న ఉదయం 11 గంటలకు పేటియం యాప్ ద్వారా విక్రయిస్తామని హెచ్సీఏ పేర్కొంది. ఇది జరిగిన కాసేపటికే ఉదయం కాదు రాత్రి 8 గంటలకు అన్నారు. తీరా ఆ సమయానికి చూస్తే వివరాలు కనిపించలేదు. రాత్రి 10 గంటలకు లింక్ అందుబాటులోకి వచ్చింది. సరే అని ఓపెన్ చేస్తే, అప్పటికే టికెట్స్ అమ్ముడుపోయినట్లు చూపించారు. దీంతో అభిమానులు షాక్ తిన్నారు. ఏదో కిరికిరి జరిగిందని ఆరోపణలు వచ్చాయి. ఇక ఆఫ్ లైన్ టికెట్స్ అయినా చెప్పిన సమయానికి ఇచ్చారా అంటే అదీ లేదు. దీనితోపాటు ఆఫ్ లైన్ టికెట్స్, స్టేడియం దగ్గర అమ్ముతామని హెచ్సీఏ అనౌన్స్ చేసింది. దీంతో వేల సంఖ్యలో క్రికెట్ అభిమానులు మైదానం దగ్గరకు చేరుకుని కిలోమీటర్ల కొద్ది క్యూ లైన్లో నిలబడ్డారు. గత మూడు రోజుల నుంచి ఇదే తంతు జరుగుతుంది. అయినాసరే హెచ్సీఏ కనీసం పట్టించుకోలేదు. ఇలా.. ఒక్కసారిగా అందరూ టికెట్స్ దక్కించుకోవడానికి ఎగబడటంతోనే ఈ విషాదం నెలకొంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.