ఓవైపు టీమిండియా పురుషుల జట్టు విజయం కోసం ఆపసోపాలు పడుతుంటే.. మహిళ జట్టు మాత్రం విజయాలతో దూసుకెళ్తోంది. ఐసీసీ ఛాంపియన్ షిప్ లో భాగంగా టీమిండియా వుమెన్స్ జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది. టీ20 సిరీస్ ను 2-1తో కోల్పొయినప్పటికీ పుజుకుని వన్డే సిరీస్ ను కైవసం చేసుకుంది. తాజాగా జరిగిన రెండో వన్డేలో 88 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ మహిళా జట్టును మట్టికరిపించింది. ఈ సిరీస్ ను కైవసం చేసుకోవడం ద్వారా టీమిండియా మహిళల జట్టు 23 ఏళ్ల చరిత్రను తిరగరాసింది. ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ ఆకాశమే హద్దుగా శతకంతో చెలరేగింది. ఈ మ్యాచ్ కు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
మెుదటగా టాస్ గెలిచి ఇంగ్లాండ్ జట్టు బౌలింగ్ ను ఎంచుకుంది. దాంతో బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా దాటిగానే మ్యాచ్ ను ప్రారంభించింది. లేడి సెహ్వాగ్ గా పిలుచుకునే షఫాలీ వర్మ(8) రెండు ఫోర్లతో తన స్ట్రాటజీని తెలిపినప్పటికీ క్రాస్ వేసిన 2వ ఓవర్లో బౌల్డ్ అయ్యింది. దాంతో క్రీజ్ లో కి వచ్చిన యస్తికా భాటియా.. గత మ్యాచ్ విన్నర్ స్మృతి మంధానతో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే భాటియా 26 పరుగుల వద్ద డీన్ బౌలింగ్ లో ఆమెకే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. అప్పటికి భారత్ స్కోర్ 11.4 ఓవర్లకు 66/2గా ఉంది. అప్పుడొచ్చింది టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్.. తొలుత స్లోగానే బ్యాటింగ్ స్టార్ట్ చేసినప్పటికీ.. రాను రాను తన బౌలర్లపై విరుచుకుపడింది. మంధాన-కౌర్ భాగస్వామ్యం కుదురుకుంది అనుకునే లోపే.. మంధాన 40 (4ఫోర్లు, 1 సిక్స్ ) పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఎక్లీస్టోన్ బౌలింగ్ లో ఎల్బీగా అవుట్ అయ్యింది. దీంతో హర్లిన్ డియోల్ బ్యాటింగ్ కు వచ్చింది.
ఈ జోడీ ఇంగ్లాండ్ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఫోర్లు, సిక్సర్లతో దుమ్మరేపింది. ఈ క్రమంలోనే హర్మన్ ప్రీత్ 64 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్స్ తో 50 పరుగులు పూర్తి చేసుకుంది. ఈ జోడి 99/3 రన్స్ నుంచి టీమిండియాను 212/4 కు చేర్చింది. ఈ క్రమంలోనే డియోల్ 72 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్ లతో 58 పరుగులు చేసి బెల్ బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యింది. డియోల్ అవుట్ అయ్యాకే కౌర్ తన విశ్వరూపం చూపించింది. తొలి అర్దశతకానికి 64 బాల్స్ తీసుకున్న కౌర్ తర్వాత అర్దశతకానికి కేవలం 36 బాల్స్ మాత్రమే తీసుకుంది. మెుత్తానికి హర్మన్ ప్రీత్ కౌర్ 111 బంతుల్లో 18 ఫోర్లు, 4 సిక్సర్లతో 143 పరుగులతో అజేయంగా నిలిచింది. దీప్తీ శర్మ 15 పరుగులతో కౌర్ కు అండగా నిలిచింది. దాంతో నిర్ణీత 50 ఓవర్లలో భారత్ 5 వికెట్ల నష్టానికి 333 పరుగుల భారీ స్కోరు ను చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో బెల్, క్రాస్, కెంప్, డీన్, ఎక్లీస్టన్ తలా ఒక వికెట్ తీశారు.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బ్రిటీష్ జట్టు 44.2 ఓవర్లలో 245 రన్స్ కు ఆలౌట్ అయ్యింది. ఇంగ్లాండ్ జట్టు ఏ దశలోనూ భారత్ కు పోటీ ఇవ్వలేదు. క్రమంగా వికెట్లు కోల్పొతూనే ఉంది. ఇక ఆ జట్టులో డానియల్ వ్యాట్ 58 బంతుల్లో 6 ఫోర్లతో 65 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచింది. మిగతా వారిలో కాప్సీ 39, డీన్ 37 పరుగులతో పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో స్వింగ్ సంచలనం రేణుకా సింగ్ 4 వికెట్లతో సత్తా చాటగా.. హేమలత 2, దీప్తి , షఫాలీ వర్మ తలా 1 వికెట్ తీశారు. దీంతో టీమిండియా ఇంకో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ ను కైవసం చేసుకుంది. ఇక ఈ మ్యాచ్ కు హైలెట్ అంటే హర్మన్ ప్రీత్ ఆటనే చెప్పాలి. తను సెంచరీ తర్వాత మరింతగా చెలరేగిపోయింది. ఎంతలా అంటే శతకం తర్వాత తాను ఎదుర్కోన్న 11 బంతుల్లో 43 పరుగులు చేసింది. ఇందులో 6 ఫోర్లు, 3 సిక్స్ లు ఉండటం విశేషం. వుమెన్ ఆఫ్ ది మ్యాచ్ ను కైవసం చేసుకుంది కౌర్. మరి తన విధ్వంస కర ఆటతో భారత్ విజయాన్ని అందించిన కౌర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
The way Harmanpreet Kaur played was excellent, what a top knock of 143*. pic.twitter.com/w9m2ZQtIFs
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 21, 2022