క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. మరికొన్ని గంటల్లో మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2022 ఆరంభంకానుంది. ఈ సందర్భంగా ఐసీసీ, టోర్నీలో పాల్గొంటున్న 16 జట్ల కెప్టెన్లతో కలిసి ఓ ఫోటోషూట్ నిర్వహించింది. ఈ ఈవెంట్లో రోహిత్ శర్మ, బాబర్ ఆజమ్ ఎంతో చనువుగా మాట్లాడుకుంటూ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. ఈ సందర్భంగా ఓ జర్నలిస్టు.. మెగా టోర్నీల్లో ఎదురుపడినపుడు భారత్, పాకిస్తాన్ ఆటగాళ్లు ఏం మాట్లాడుకుంటారంటూ ప్రశ్న అడుగగా.. రోహిత్ ‘ కుటుంబ విషయాల గురుంచి, ఖరీదైన కార్ల గురుంచి ముచ్చటిస్తాం..’ అని తెలిపాడు.
ఆదివారం నుంచి పొట్టి ప్రపంచకప్ ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐసీసీ శనివారం నాడు ‘కెప్టెన్స్ డే’ను నిర్వహించింది. ఇందులో 16 జట్ల కెప్టెన్లు పాల్గొని ఫోటోలకు ఫోజులిచ్చారు. ఇది ముగిశాక మీడియాతో మాట్లాడిన రోహిత్ శర్మ.. “జట్టు సన్నద్ధతను, పాక్ తో జరగబోయే మ్యాచ్ గురుంచి, ఇరుజట్ల ఆటగాళ్లు కలిసినపుడు మాట్లాడుకునే వ్యక్తిగత విషయాల గురుంచి బయటపెట్టాడు. “ఇండియా- పాక్ మ్యాచ్ అనగానే.. ప్రతిసారీ దీని గురించి మాట్లాడి ఒత్తిడి సృష్టించడంలో అర్థం లేదు. వాళ్ళ ఆటను మేం అర్థం చేసుకున్నాం.. అలాగే ఆ మ్యాచులో ఎవరిని ఆడించాలనే విషయంపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్నా. ప్లేయర్లకు కూడా సమాచారం ఇచ్చా”.
Rohit Sharma spoke on some key points in the press conference ahead of T20 World Cup 2022.#RohitSharma #T20WorldCup #CricketTwitter pic.twitter.com/jEORMCvgj7
— CricTracker (@Cricketracker) October 15, 2022
ఇక పాక్ ఆటగాళ్లను కలిసినప్పుడంటారా!.. ‘మీరు ఎలా ఉన్నారు..?’ ‘మీ కుటుంబం ఎలా ఉంది..?’ ఇలాంటి విషయాలే మాట్లాడుతాం. లేదంటే కొత్త కారు ఏదైనా కొన్నారా.. లేదా అమ్మారా.. లాంటి విషయాలూ చర్చించుకుంటాం’ అని వివరించాడు. క్రికెట్ ప్రపంచంలో భారత్, పాకిస్తాన్ మధ్య ఉన్న వైరం మామూలుది కాదు. ఈ రెండు జట్లు ఆడుతున్నప్పుడు వచ్చే వ్యూయర్షిప్, డబ్బులే అందుకు ఉదాహరణ. ప్రస్తుతానికి కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు జరగడం లేదు. కేవలం ఐసీసీ టోర్నీలోనే తలపడుతున్నాయి. ఈ క్రమంలో అందరి కళ్లు అక్టోబర్ 23న జరగనున్న భారత్- పాకిస్తాన్ మ్యాచ్ పైనే ఉన్నాయి. ఈ మ్యాచులో విజయం సాధించి గత ప్రపంచకప్ ఓటమికి బదులు తీర్చుకోవాలని భావిస్తోంది.. భారత్. కాగా, గత ప్రపంచకప్ లో భారత్ 10 వికెట్ల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే.