విశాఖ భూములపై ఓపెన్ ఛాలెంజ్ చేశారు వైసీపీ నేత విజయసాయి రెడ్డి. తన ఆస్తుల గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖపట్టణంలో తనకు ఒకటే ఫ్లాట్ ఉందని స్పష్టం చేశారు. తనపై వస్తోన్న ఆరోపణల నేపథ్యంలో.. తాను సీబీఐ, ఈడీ, ఆఖరికి అమెరికా ఎఫ్బీఐ విచారణకు కూడా సిద్ధంగా ఉన్నానని తాజాగా ప్రకటించారు. మరి తన మీద ఆరోపణలు చేస్తున్న మీడియా సంస్థల యజమానులు విచారణకు రెడీగా ఉన్నారా అని ప్రశ్నించారు. సీబీఐ విచారణలో ఎవరు జైలుకు వెళ్తారో తేలుతుంది అన్నారు. అంతేకాక తాను ఇప్పటి వరకు వ్యాపారం చెయ్యలేదన్నారు విజయసాయిరెడ్డి. ఇంకా ఇరిటేట్ చేస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి ప్రవేశిస్తానని చెప్పుకొచ్చారు.
అంతేకాక తన మీద తప్పుడు ప్రచారం చేస్తోన్న మీడియా సంస్థలకు పోటీగా తానే ఛానెల్ ప్రారంభిస్తానని విజయసాయి రెడ్డి ఈ సందర్భంగా ప్రకటించారు. ఇలానే తనకు చిరాకు కలిగిస్తే.. పేపర్ పెడతాను.. రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి కూడా ఎంటర్ అవుతానని స్పష్టం చేశారు విజయసాయి రెడ్డి. అంతేకాక తన కుమార్తె అత్తింటి కుటుంబం 40 ఏళ్లుగా వ్యాపార రంగంలో వున్నారని.. తన వియ్యంకుడి కుటుంబం ఆస్తులు కొనుగోలు చేస్తే వాటితో తనకేం సంబంధం అని విజయసాయి రెడ్డి నిలదీశారు.
ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే అర్థం తెలియని సన్నాసులు మాట్లాడుతున్నారని.. వైసీపీపై దురుద్దేశంతో దుష్ప్రచారం జరుగుతోందని ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక విశాఖలో రాజధానిని అడుడ్డకోవడం.. అమరావతి భూములతో లక్షల కోట్లు సంపాదించాలనే కుట్రలో భాగమేనన్నారు. కొన్ని పత్రికలు వార్తలను కులం అనే ఇంకుతో రాస్తున్నాయని.. ఇలాంటి విషపు రాతలు రాసే మీడియాకు తమ ప్రభుత్వ ఏమి చేసిన తప్పుగానే కనిపిస్తుందని విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.