సుమారు వందేళ్ల చరిత్ర కలిగి.. ఒకప్పుడు దేశం మొత్తాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ.. నేడు ఎలాంటి పరిస్థితుల్లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దక్షిణాదిలో పూర్తిగా తన పట్టు కోల్పోయింది. ఉత్తరాదిలో చాలా తక్కువ ప్రాంతాల్లో మాత్రమే ప్రస్తుతం ఆ పార్టీకి పట్టుంది. కాంగ్రెస్ బలోపేతం కోసం ఓ వైపు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా జోడో యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి అతి పెద్ద బలం, అధికారాన్ని కట్టబెట్టిన రాజస్థాన్లో పరిస్థితులు తారుమారవుతున్నాయి. ఏకంగా ఒకేసారి 82 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఆ వివరాలు..
రాజస్తాన్లో రాజకీయ సంక్షోభం ముదిరింది. సీఎం అశోక్ గహ్లోత్ మద్దతుదారులైన 82 మంది ఎమ్మెల్యేలు ఆదివారం రాజీనామా చేశారు. గహ్లోత్ కాంగ్రెస్ అధ్యక్షుడైతే.. ఆయన తర్వాత రాజస్తాన్ తదుపరి సీఎంగా సచిన్ పైలెట్ని నియమించింది అధిష్టానం. ఈ నిర్ణయాన్ని గహ్లోత్ మద్దతుదారులు వ్యతిరేకిస్తున్నారు. గతంలో సచిన్ పైలట్ పార్టీపై తిరుగుబాటు చేసి.. ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అలాంటి వ్యక్తికి సీఎం పదవి కట్టబెట్టడం ఏంటని.. గహ్లోత్ మద్దతుదారులు ప్రశ్నిస్తున్నారు. తదుపరి సీఎం గహ్లోత్ వర్గానికి చెందిన వారే కావాలని ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నారు.
ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం ఎమ్మెల్యేలంతా.. కేబినెట్ మంత్రి శాంతి ధరివాల్ నివాసంలో భేటీ అయ్యారు. అనంతరం వీరంతా స్పీకర్ జోషి నివాసానికి చేరుకుని.. తమ రాజీనామాలు సమర్పించారు. అంతేకాక గహ్లోత్ తమను సంప్రదించకుండానే.. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని ఎలా నిర్ణయించుకుంటారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గహ్లోత్ వర్గానికి చెందిన సీపీ జోసి లేదా, రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు.. గోవింద్ సింగ్ దొటాస్రా కొత్త సీఎం ఉండాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. మరి ఎమ్మెల్యేల నిర్ణయంపై కాంగ్రెస్ అధిష్టానం ఎలా స్పందిస్తుదో చూడాలి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.