మరికొన్ని రోజుల్లో మునుగోడు ఉప ఎన్నిక జరగనుంది. ఇప్పటికే నామినేషన్ల పర్వం సాగుతోంది. ఇక అన్ని పార్టీలు ప్రచారం మీద దృష్టి పెట్టాయి. ఓటర్లను ఆకర్షించేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తున్నాయి. మునుగోడులో భారీగా డబ్బు ఖర్చు చేస్తున్నారు నేతలు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి శాయశక్తుల ప్రయత్నిస్తున్నారు. అన్ని రకాలుగా ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు. వెరసి మునుగోడు ఎన్నిక దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికగా మారనుంది. టీఆర్ఎస్తో పోల్చితే కాంగ్రెస్, బీజేపీలకు మునుగోడులో గెలుపు అనివార్యం. పైగా.. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా కారణంగానే ఈ ఉప ఎన్నిక కావడంతో బీజేపీకి ఎన్నిక అత్యంత కీలకంగా మారింది.
మునుగోడులో ధన ప్రవాహం ఓ రేంజ్లో కొనసాగుతుంది. ఇప్పటికే మొదటి విడతలో భాగంగా కొన్ని పార్టీలు ఓటర్లకు 10 వేల రూపాయలు పంపినట్లు తెలుస్తోంది. పోలింగ్కు ముందు మరో విడత పంపిణీ ఉంటుందని ఓటర్లకు చెబుతున్నారు. మొత్తంగా ఒక ఓటుకు ఏకంగా 30 వేల రూపాయలు ముట్ట చెప్పేందుకు పార్టీలు రెడీ అవుతున్నాయి. ఇన నియోజకవర్గంలో ఉన్నవారికే కాక.. పోలింగ్ రోజున వచ్చి ఓటు వేసే వారికి ఇప్పటికే ఓటుకు 40 వేల చొప్పున ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఓ పార్టీ అయితే ఏకంగా ఓటుకు తులం బంగారం అని ప్రకటించినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే పలు ప్రాంతాల్లో.. ఓటర్లకు బంగారం పంపిణీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. పార్టీల తీరు చూస్తే.. తెలంగాణలో ఎన్నికల ఖర్చును మునుగోడుకు ముందు, మునుగోడుకు తర్వాత అన్నట్లుగా మార్చేస్తున్నారు. ఆ మాటకొస్తే.. ఒక్క తెలంగాణలోనే కాక.. భారతదేశంలోనే మునుగోడు ఉప ఎన్నిక అత్యంత ఖరీదైన ఎన్నికగా మారనుంది. ఒక్కో పార్టీ ఇన్ని వందల కోట్లు ఖర్చు పెట్టిన చరిత్ర దేశంలోనే ఉండబోదు అనేలా ఇప్పటికే పరిస్థితిని మార్చేశారు నాయకులు. మరి మునుగోడు ఓటరు ఎవరి మీద దయ చూపిస్తాడో తెలియాలంటే.. మరికొన్ని రోజులు ఎదురు చూడాలి.