కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి చెందిన ఆడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ఆయా పార్టీల మధ్య పోటీ తీవ్ర స్థాయిలో ఉంది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కారణంగా మునుగోడు ఉప ఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ తరపున అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అయితే తన తమ్ముడ్ని గెలిపించండి అంటూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫోన్ లో మాట్లాడిన ఆడియో ఒకటి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
సొంత పార్టీ నాయకులతో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫోన్ లో మాట్లాడిన ఆడియో ఒకటి బయటకు వచ్చింది. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి అయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓటు వేయాలని కోరినట్లు ఆడియో సారాంశం. పార్టీలను పక్కన పెట్టి తన తమ్ముడ్ని గెలిపించాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరారు. ఏదైనా ఉంటే తాను చూసుకుంటానని హామీ ఇచ్చారు. చచ్చినా, బతికినా రాజగోపాల్ రెడ్డి సహాయం చేస్తూ ఉంటారని, మునుగోడు ఉప ఎన్నికలో ఓటు మా ఓనికే వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ దెబ్బతో పీసీసీ చీఫ్ కూడా అవుతానని ఆయన ధీమా వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తన తమ్ముడ్ని గెలిపిస్తే.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి.. కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొస్తానని చెప్పారు. ప్రస్తుతం ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.