పలు కాంపీటీటివ్ పరీక్షలు, ఇంజనీరింగ్, మెడిసన్ వంటి కోర్సులు ఇంగ్లీష్లో ఉండటం పట్ల ఎప్పటి నుంచో అభ్యంతరం వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గత ఏడాది నుంచే ఏపీ సహా దేశవ్యాప్తంగా మొత్త 14 ఇంజనీరింగ్ కాలేజీల్లో.. ప్రాంతీయ భాషల్లో ఇంజనీరింగ్ బోధించేందుకు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా వైద్య విద్య ఎంబీబీఎస్ను కూడా హిందీలో అందించేందుకు రెండు రాష్ట్రాలు ముందుకు వచ్చాయి. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని గాంధీ మెడికల్ కాలేజీ, ఛత్తీస్గడ్లోని బిలాస్పూర్లోని అటల్ బిహారీ వాజ్పేయీ విశ్వవిద్యాలయంలో ఈ ఏడాది నుంచి హిందీ మీడియంలో ఎంబీబీఎస్ అందుబాటులోకి రానుంది. ఈ మేరకు సదరు కాలేజీల యాజమాన్యం.. ఎంబీబీఎస్ మొదటి సంవత్సరానికి సంబంధించిన టెక్స్ట్ బుక్స్ని ఇప్పటికే హిందీలోకి అనువదించారు.
ఈ క్రమంలో అక్టోబర్ 16న భోపాల్లో జరిగే కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఈ పుస్తకాలను ఆవిష్కరిస్తారు. ఇక ఈ రెండు వైద్య కళాశాలలు.. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేవి. వీటిలో 15 శాతం సీట్లను జాతీయ కోటా కింద కేటాయించాలి. ఈ క్రమంలో ఈ కాలేజీల్లో హిందీ మీడియంలో ఎంబీబీఎస్ని బోధిస్తే.. హిందీయేతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు సీట్లు కేటాయిస్తే.. ఇబ్బంది తప్పదని నిపుణులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా ప్రాంతీయ భాషలో ఇంజనీరింగ్ విద్యకు ఆదరణ పెరుగుతోంది. గత ఏడాది ప్రాంతీయ భాషలో ఇంజనీరింగ్ కోర్సు అందించే కాలేజీల సంఖ్య 14 ఉండగా.. తాజాగా వాటి సంఖ్య 20కి చేరింది. ఇక ఎంబీబీఎస్కి కూడా ఇలానే ఆదరణ పెరుగుతుందని భావిస్తున్నారు.