రేషన్ కార్డు ఉన్న వారికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ‘ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన’ పథకంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. తాజా నివేదికల ప్రకారం.. పేదలకు అందించే ఉచిత రేషన్ ను సెప్టెంబర్ 30 తర్వాత కూడా పొడిగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ పథకాన్ని 2020లో మార్చి నెలలో అమలులోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ పథకంలో భాగంగా 80 కోట్ల మంది రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులకు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఉచితంగా బియ్యం అందిస్తూ వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేవి కాకుండా మోదీ ప్రభుత్వం సెపరేట్ గా ఉచిత బియ్యాన్ని ఇస్తుంది.
ఈ పథకం కింద ఒక్కో వ్యక్తికి 5 కిలోల చొప్పున ఉచిత బియ్యం అందజేస్తోంది ప్రభుత్వం. కార్డులో ఎంతమంది ఉంటే అంతమందికి అన్ని కేజీల చొప్పున బియ్యం అందజేస్తోంది. ఒక ఇంట్లో నలుగురు కుటుంబ సభ్యులు ఉంటే ఒక్కొక్కరికీ 5 కిలోల చొప్పున 20 కిలోల బియ్యాన్ని పంపిణీ చేస్తుంది. మార్చి నెల చివరికి ఈ పథకం కింద రూ. 2.6 లక్షల కోట్లు ఖర్చు చేసింది. సెప్టెంబర్ నెలాఖరు కల్లా మరో రూ. 80 వేల కోట్ల భారం పడింది. దీంతో కేంద్రం ఈ పథకం కింద రూ. 3.4 లక్షల కోట్లు ఖర్చు పెట్టింది. గత పొడిగింపు వరకూ, ప్రభుత్వం ఈ పథకం కింద 1000 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను కేటాయించింది. లాక్ డౌన్ లో పేద ప్రజలు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో మోదీ సర్కార్ ఈ పథకాన్ని అమలులోకి తీసుకొచ్చింది.
కేంద్ర ప్రభుత్వం గత మార్చి నెలలో ఈ పథకం గడువుని సెప్టెంబర్ 30 వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే సెప్టెంబర్ 30తో ఈ పథకం యొక్క గడువు ముగియనుండడంతో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగిస్తుందా? లేక ఆపేస్తుందా? అని ప్రజలు సందిగ్ధంలో ఉన్నారు. ఇదే విషయమై ఫుడ్ సెక్రటరీ సుధాన్షు పాండేను అడిగితే.. ఉచిత రేషన్ పై కేంద్రం త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వెల్లడించారు. అది ప్రభుత్వ నిర్ణయమని, పెద్ద నిర్ణయమని.. అయితే ఏదో ఒక నిర్ణయానికి వస్తుందని తెలిపారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వార్షిక సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సెప్టెంబర్ 30 తర్వాత కూడా కేంద్రం ఈ పథకాన్ని పొడిగించే అవకాశం ఉందని, కేంద్రం దీనిపై సమీక్షిస్తున్నట్లు సమాచారం. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.
Govt to take call on extending free ration scheme #PMGKAY beyond September: Food secretary
Read: https://t.co/tSGVi6DM13 pic.twitter.com/ZrEGqBcKdf
— The Times Of India (@timesofindia) September 19, 2022