నేషనల్ డెస్క్- ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. మంగళవారం సాయంత్రం ఓల్డ్ సీమాపురిలోని ఓ మూడంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఫైర్ యాక్సిడెంట్ లో మొత్తం నలుగురు సజీవదహనమయ్యారు. ఉన్నట్లుండి భవనంపై అంతస్తులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయని ఢిల్లీ పోలీసులు చెప్పారు.
ఈ అగ్నిప్రమాదంలో చనిపోయిన మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ఫైర్ యాక్సిడెంట్ లో ఇంటి యజమాని హౌరీ లాల్, ఆయన భార్య రీనా,, కుమారుడు అషు,, కుమార్తె రాధిక సజీవదహనమయ్యారు. భవనంలో అగ్ని ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక దళాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.
మొత్తం నాలుగు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఫైర్ యాక్సిడెంట్ ఘటనపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదుచేసిన విచారణ చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఐతే ఈ అగ్ని ప్రమాదం నుంచి హౌరీ లాల్ మరో కుమారుడు అక్షయ్ మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు.
అక్షయ్ ఆ భవనంలోని రెండో అంతస్తులో నిద్రపోవడం వల్లే అతడి ప్రాణాలు దక్కాయి. బిల్డింగ్ యజమాని హౌరీ లాల్ శాస్త్రీ భవన్లో క్లాస్ 4 ఉద్యోగి. ఆయన భార్య ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లో స్వీపర్ గా పనిచేస్తోంది. దోమల కోసం వెలిగించిన కాయిల్ వల్లే అగ్నిప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాధమిక నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది.