అమరావతి- ఆంద్రప్రదేశ్ లో ప్రభుత్వానికి, ప్రభుత్వ ఉద్యోగులకు మధ్య వివాదం నడిస్తోంది. పీఆర్సీ పెంపుపై జగన్ సర్కారుపై అసంతృప్తితో ఉన్న ఉద్యోగులు, వచ్చే నెలలో సమ్మెకు సిద్దమవుతున్నారు. ఈనెల పాత విధానం ద్వారానే జితాలు చెల్లించాలని ఉద్యోగులు కోరుతుండగా, కొత్త పీఆర్సీ లో భాగంగానే జీతాలు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్దమైంది.
ఇదిగో ఇటువంటి సమయంలో ప్రభుత్వ ట్రెజరీ ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. ట్రెజరీ ఉద్యోగులకు ఇప్పటికే ప్రభుత్వం మెమోలు జారీ చేసింది. తాజాగా, ఏపీలో ట్రెజరీ ఉద్యోగులు ఆదివారం కూడా పని చేయాలని జగన్ ప్రభుత్వం శనివారం రాత్రి ఆదేశాలు జారీ చేసింది. ఆదివారం ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యాలయాల్లోనే ఉండి ఉద్యోగుల జీతాలకు సంబందించిన బిల్లులను క్లియర్ చేయాలని ఆదేశాల్లో పేర్కొంది.
ఇందుకు సంబందించి రాష్ట్రంలోని కార్యాలయాలన్నిటికీ శనివారం రాత్రి మెసేజ్లు వెళ్లాయి. ఇతర శాఖల నుంచి వచ్చిన బిల్లులనూ క్లియర్ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉద్యోగులు ఎవరైనా ఆదేశాలను ఉల్లంఘిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని ఉన్నతాధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఉద్యోగులకు పెరిగిన కొత్త జీతాలకు సంబంధించిన బిల్లులు జారీ చేయని అధికారులకు మెమోలు ఇచ్చింది. విధుల్లో నిర్లక్ష్యం వహించే సహించేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. సర్కార్ ఆదేశాల మేరకు బిల్లులు సిద్దం చేయని డీడీవోలు, ట్రెజరీ అధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు, సంబంధిత హెచ్ఓడీలతు జగన్ ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు విధుల్లో విఫలమైన వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఆదివారం పనిచేసి, బిల్లులను క్లియర్ చేయాలని ట్రెజరీ ఉద్యోగులను ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వైఎస్ జగన్ ప్రభుత్వ వైఖరిపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.