దసరా పండుగ సందర్భంగా బీజేపీ నేత బండారు దత్తాత్రేయ నిర్వహించిన అలాయ్ బలాయ్ కార్యక్రమం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఈ సారి ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనను చూసిన ఆనందంలో అభిమానులు.. చిరంజీవితో ఫోటో దిగడానికి ఎగబడ్డారు. ఈ విషయం కాస్త అక్కడే వేదిక మీద ఉన్న ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసిహరావుకి కోపం తెప్పించింది. దాంతో ఆయన బహరింగంగా చిరంజీవి మీద అసహనం ప్రకటించారు. గరికపాటి చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపాయి. దీనిపై టాలీవుడ్ ప్రముఖలు స్పందిస్తున్నారు. ఆర్జీవీ సైతం గరికపాటిని తప్పుపడుతూ ట్వీట్లు చేశాడు. ఈ క్రమంలో తాజాగా ఈ వివాదంపై ఉత్తేజ్ మాట్లాడుతూ.. చిరంజీవి వ్యక్తిత్వం ఎంత గొప్పగా ఉంటుంది.. అభిమానుల విషయంలో ఆయన ఎలా ప్రవర్తిస్తారో చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా ఉత్తేజ్ మాట్లాడుతూ..‘‘చిరంజీవి ప్రాంరభించిన బ్లడ్ బ్యాంక్ దగ్గర రెండు మూడొందల మంది లైన్లో ఉంటారు. వారందరూ రక్తదానం చేసేవరకు అన్నయ్య అలాగే కదలకుండా ఉంటారు. వచ్చిన వాళ్లందరూ మాత్రం మారిపోతా ఉంటారు. ఇక స్టార్ హీరోతో అభిమాని దిగే ఫొటోకు ఎలాంటి విలువ, అభిమానం ఉంటాయో అన్నయ్యకు తెలుసు. ఎవరైనా ఫ్యామిలీ వెళ్లి ఆయనతో ఫొటో దిగితే.. రెండుమూడు గంటల్లో వాళ్లింటిలో ఆ ఫొటో ఉంటుంది. ఎందుకంటే, ఇక్కడ కెమెరామేన్తో ఫొటో తీయించుకుంటారు. ఫొటో దిగాం కానీ.. వస్తుందో రాదో అనే టెన్షన్ వారిలో ఉంటుంది. అందుకే, నెగిటివ్స్తో సహా ఫోటోలు వాళ్లింటికి పంపిస్తారు. అభిమానులతో ఫోటో అంటే అన్నయ్య అంత వ్యాల్యూ ఇస్తాడు’’ అంటూ ఉత్తేజ్ చెప్పుకొచ్చారు.
చిరంజీవితో ఫొటోలు దిగాలనే పిచ్చి చాలా మందికి ఉంటుంది అన్నారు ఉత్తేజ్. ‘‘చిరంజీవి గారిని ముట్టుకుంటే గుక్కపెట్టి ఏడ్చేస్తా ఉంటారు. నేను ఏడ్చాను. ఆరోజు 8-9-1996.. సారథి స్టూడియోలో మధ్యాహ్నం 3.45 గంటలకు ఫస్ట్ టైమ్ అన్నయ్యకి షేక్ హ్యాండ్ ఇచ్చాను. హిట్లర్ షూటింగ్ సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. తొలిసారి ఆయనను టచ్ చేసినప్పుడు ఆ సంతోషం తట్టుకోలేక తెగ ఏడ్చాను. ఇలాంటి అనుభవం సురేఖా వాణికి కూడా ఎదురయ్యింది. ఓ సారి లాల్ బహదూర్ స్టేడియంలో సురేఖా వాణి.. చిరంజీవిని ముట్టుకుని గుక్కపెట్టి ఏడ్చింది. అలాంటి కొన్ని వందల మందిని నేను చూశాను’’ అంటూ చెప్పుకొచ్చారు ఉత్తేజ్. ఇప్పుడున్న పరిస్థితుల్లో చిరంజీవి ఒక స్టార్ కాదని.. ఒక ప్రతిఫలాపేక్ష కోరని ప్రకృతిలా మారారని.. సేవ చేయడం లక్ష్యం కాకూడదని.. అది వ్యక్తిత్వం అవ్వాలని.. అలాంటి వ్యక్తిత్వం ఉన్న గొప్ప మనిషి చిరంజీవి అని ఉత్తేజ్ ప్రశంసల వర్షం కురిపించారు.
అలాంటి వ్యక్తిని ఉద్దేశించి.. గరికపాటి నరసింహారావు ఒక సభలో ఆ విధంగా మాట్లాడటం సమంజసం కాదని ఉత్తేజ్ అభిప్రాయపడ్డాడు. ‘‘చిరంజీవితో వాళ్లంతా ఫొటోలు దిగుతుంటే మీరు తట్టుకోలేకపోయారా? ఎందుకంత అక్కసు మీకు. ఆ అసూయ ఎందుకు’’ అని ఉత్తేజ్ ఈ సందర్భగా గరికపాటిని ప్రశ్నించారు. అంతేకాక తనకు కూడా గరికపాటి అంటే తనకు చాలా గౌరవమని.. సరస్వతీ పుత్రుడైన ఆయన చిరంజీవి లాంటి మహావృక్షాన్ని అలా ఎలా అనగలిగారని ఆవేదన వ్యక్తం చేశాడు ఉత్తేజ్.