తెలుగు బుల్లితెరపై విశేషంగా ప్రేక్షకాదరణ పొందిన కామెడీ షోలలో ‘ఎక్సట్రా జబర్దస్త్’ ఒకటి. ఈ షోకి యాంకర్ రష్మీ హోస్ట్ కాగా.. నటి ఇంద్రజ, సింగర్ మనో న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రతి శుక్రవారం ఎక్సట్రా జబర్దస్త్ ఈటీవీలో ప్రసారమవుతూ వస్తోంది. అయితే.. ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకులను కామెడీతో ఆకట్టుకుంటున్న షోలో అప్పుడప్పుడు ఎమోషనల్ మూమెంట్స్ కూడా ఎదురవుతుంటాయి. ప్రతి వారం తర్వాత ఎపిసోడ్ కి సంబంధించి నిర్వాహకులు ప్రోమోలు రిలీజ్ చేస్తుంటారని తెలిసిందే.
ఈ వారం కూడా ఎక్సట్రా జబర్దస్త్ కొత్త ప్రోమో రిలీజ్ చేశారు. ప్రోమోలో కమెడియన్స్ అంతా వారి శైలిలో కామెడీతో ఆకట్టుకున్నారు. కొన్ని పెర్ఫార్మన్సులు జనాలకు విపరీతంగా నచ్చేశాయి. కానీ.. రాకింగ్ రాకేష్ టీమ్ విషయానికి వచ్చేసరికి.. కామెడీ అనంతరం ఎమోషనల్ సీన్ చోటుచేసుకుంది. రాకేష్ టీమ్ మెంబర్ గా అందరినీ నవ్వించే ప్రవీణ్ స్టేజిపై తన తల్లిదండ్రులను తలచుకొని భావోద్వేగానికి గురయ్యాడు. తనతో పాటు షోలో ఉన్న వారందరినీ కాసేపు కంటతడి పెట్టుకునేలా చేశాడు.
జబర్దస్త్ ప్రవీణ్ మాట్లాడుతూ.. “దేవుడు మా అమ్మను తీసుకెళ్లాక.. మా నాన్నను ఒక్కడినే నాకిచ్చాడు. ఏ బాధ వచ్చినా మా నాన్న ఒక్కడితోనే నేను షేర్ చేసుకునేది. కానీ.. ఈరోజు ఆయన కూడా లేకుండా పోయాడు. నాకు రోజు నైట్ ఫోన్ చేసి తిన్నవారా? అని అడిగాకే మా నాన్న పడుకునేవాడు” అని స్టేజిపైనే ఏడ్చేశాడు. ప్రవీణ్ మాటలు విని అందరూ ఎమోషనల్ అయిపోయారు. ఆ తర్వాత జడ్జి ఇంద్రజ వచ్చి ప్రవీణ్ ని ఓదార్చడం మనం ప్రోమోలో చూడవచ్చు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ అవుతోంది. మరి జబర్దస్త్ ప్రవీణ్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.