‘వీరసింహారెడ్డి’ సక్సెస్ మీట్ లో నందమూరి బాలకృష్ణ అక్కినేని ఫ్యామిలీతో పాటుగా దివంగత ప్రముఖ నటుడు ఎస్వీ రంగారావుపై చేసిన వ్యాఖ్యలు పరిశ్రమలో పెద్ద దుమారాన్నే లేపాయి. బాలకృష్ణ వ్యాఖ్యలపై అక్కినేని ఫ్యామిలీ రియాక్ట్ అయిన సంగతి కూడా మనందరికి తెలిసిందే. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీ రంగారావులను కించపరచడం అంటే మనల్ని మనం కించపరుచుకోవడమే అని అక్కినేని హీరోలు సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అవ్వగా.. తాజాగా ఎస్వీ రంగారావు మనవళ్లు ఈ విషయంపై స్పందించారు. మాకూ నందమూరి ఫ్యామిలీకి మంచి అనుబంధం ఉందని, బాలయ్య మాట్లాడిన మాటల్లో మాకు ఎలాంటి వివాదం కనిపించడం లేదన్నారు ఎస్వీ రంగారావు మనవళ్లు. మరిన్ని వివరాల్లోకి వెళితే..
వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో బాలకృష్ణ మాట్లాడిన మాటలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే స్పందించారు అక్కినేని హీరోలు. తాజాగా బాలకృష్ణ వ్యాఖ్యలపై స్పందించారు దివంగత నటుడు ఎస్వీ రంగారావు మనవళ్లు. బాలకృష్ణపై వస్తున్న ట్రోల్స్, కామెంట్స్, విమర్శలపై వీడియో బైట్ రిలీజ్ చేశారు ఎస్వీ రంగారావు మనవళ్లు జూనియర్ ఎస్వీ రంగారావు (నటుడు), SVLS రంగారావులు. ఎస్వీ రంగారావు మనవళ్లు మాట్లాడుతూ..”గత కొన్ని రోజులుగా బాలకృష్ణ వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో మాట్లాడిన మాటలపై సోషల్ మీడియాలో ట్రోల్స్, విమర్శలు వస్తున్నాయి. ఇక ఎస్వీ రంగారావు కుటుంబ సభ్యులుగా, మనవళ్లుగా మేం ఒక విషయం చెప్పదలుచుకున్నాం. మాకు బాలయ్యతో మంచి అనుబంధం ఉంది, మేం ఒక కుటుంబంగా ఉంటాం. సాధారణ పోకడలోనే ఆయన ఆ విధంగా మాట్లాడారు. ఇందులో మాకు ఎలాంటి వివాదం కనిపించడం లేదు” అని వారు ఈ వీడియోలో చెప్పుకొచ్చారు. అలాగే ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలని, ఇంకా సాగదీయవద్దని కోరుకున్నారు. ఇందులో వివాదాన్ని తీసుకొచ్చి మాకు, నందమూరి కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని చెడగొట్టొద్దు అని వేడుకున్నారు.