రూ. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడు సుకేష్ చంద్రశేఖర్ తో సంబంధం ఉన్న నోరా ఫతేహీని ఢిల్లీ పోలీసులు ప్రశ్నించారు. ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ కి చెందిన పోలీసులు శుక్రవారం సుమారు నాలుగు గంటల పాటు విచారించారు. దీనికి సంబంధించిన విషయాలు అధికారులు బయట పెట్టాల్సి ఉంది. గతంలో ఈ కేసులో ఈడీ విచారణ ఎదుర్కొంది నోరా ఫతేహీ. ఆ సమయంలో ఈడీ అధికారులు ఆమెను ప్రశ్నించారు. గతంలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తో పాటు నోరా ఫతేహీకి కూడా సుకేష్ ఖరీదైన బహుమతులు ఇచ్చినట్లు ఈడీ విచారణలో తేలడంతో ఈడీ అధికారులు సుకేష్, నోరా ఫతేహీలను ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారించారు. అయితే 2020 డిసెంబర్ 12కి ముందు తానూ సుకేష్ తో అసలు మాట్లాడనే లేదని నోరా ఫతేహీ విచారణలో వెల్లడించింది. కానీ సుకేష్ మాత్రం తాను నోరా ఫతేహీతో మాట్లాడినట్లు చెప్పాడు.
ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2022లోని సెక్షన్ 50 కింద.. 2021 సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో నోరా ఫతేహీ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఛారిటీ ఈవెంట్ కోసం తనను అడిగారని, అదే సమయంలో సుకేష్ భార్య లీనా పాలోస్.. తనకు గుచీ బ్యాగ్, ఐఫోన్ బహుమతిగా ఇచ్చిందని నోరా ఫతేహీ తెలిపింది. నోరా ఫతేహీకి ఖరీదైన బీఎండబ్ల్యూ కారుని బహుమతిగా ఇచ్చినట్లు ఈడీ గుర్తించింది. అయితే ఆ కారును సుకేష్ కి తిరిగి ఇచ్చేసినట్లు నోరా ఫతేహీ విచారణలో తెలిపింది. రాన్ బాక్సి మాజీ ప్రమోటర్లు మల్విందర్ సింగ్, శివిందర్ సింగ్ కు బెయిల్ ఇప్పిస్తానని చెప్పి.. వారి భార్యల దగ్గర సుకేష్ చంద్ర శేఖర్ రూ. 200 కోట్లు వసూలు చేశాడు. అయితే బెయిల్ ఇప్పించకపోవడంతో.. శివిందర్ సింగ్ భార్య అదితి సింగ్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు 2021లో సుకేష్ ను అరెస్ట్ చేశారు.
పోలీసులు సుకేష్ ను విచారించగా అతనితో పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు తేలింది. బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కు రూ. 10 కోట్ల విలువైన బహుమతులు ఇచ్చినట్లు విచారణలో తేలింది. దీంతో ఈ కేసులో జాక్వెలిన్ ను నిందితురాలిగా చేరుస్తూ.. ఈడీ ఛార్జ్ షీట్లు దాఖలు చేసింది. విచారణకు హాజరు కావాలని ఢిల్లీ పోలీసులు ఇటీవల జాక్వెలిన్ కు సమన్లు జారీ చేశారు. తాజాగా ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్న నోరా ఫతేహీ ఢిల్లీ పోలీసులు విచారించారు. మరి ఈ విచారణలో నోరా ఫతేహీ ఏం స్టేట్మెంట్ ఇచ్చిందో బయటకు రావాల్సి ఉంది. దీనిపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.