మనిషి దుఃఖాలకు మూలం కోర్కెలు. అవి అదుపులో లేకుంటే మనిషి జీవితం కష్టాల పాలవుతుంది. కొందరు తాము ఉన్న స్థితికి మించి ఎక్కువగా ఊహించుకుంటారు. తమ కంటే ఉన్నతంగా ఉన్నవారిని చూసి.. వారిలా విలాసంగా బ్రతకాలని కోరుకుంటారు. అయితే ఆ ఆశలు హద్దులు దాటి చెడు మార్గాల వైపు ఉసిగొల్పు తాయి. చివరికి అనర్ధాలను తెచ్చిపెడతాయి. తాజాగా విలాసాలకు బానిసైన ఓ మహిళ ఐదుగురిని పెళ్లి చేసుకుని మోసం చేసింది. వారి నుంచి వచ్చిన డబ్బులతో దర్జాగా బతకడం అలవాటు చేసుకుంది. చివరికి బాధితులల్లో ఒకరు పట్టుకుని ఆమెను పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. వివరాల్లోకి వెళ్తే..
తమిళనాడులోని కరూర్ పట్టణంలో నిరుపేద కుటుంబానికి చెందిన సౌమ్య అలియాస్ శబరి అనే 28 ఏళ్ల యువతి బీకాం చదివింది. ఆమె తండ్రి టీ స్టాల్ నడుపుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. అయితే వారి ఇంటి ప్రాంతంలో ధనవంతుల నివాసాలు ఉన్నాయి. దీంతో తన చుట్టూ ఉన్న వారి చూసి సౌమ్య కూడా విలాసంగా జీవించాలని అనుకునేది. ఈక్రమంలో ఇతరులను మోసం చేసి దర్జాగా ఉండేది. అయితే సౌమ్య తీరు.. ఆమె తల్లిదండ్రులకు నచ్చేది కాదు. దీంతో కుటుంబ సభ్యులతో విబేధించిన సౌమ్య రామనాథపురంలోని ఓ హాస్టల్ లో ఉండేది. అక్కడ ఉంటున్న సమయంలో రాజేష్ అనే పోలీసుతో సౌమ్యకు పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారి.. చివరకు పెళ్లి చేసుకున్నారు. అయితే భర్త పోలీసులు కావడంతో సౌమ్యలో ఆలోచనలు పెరిగాయి. రాజేష్ పలుకుబడిని ఉపయోగించుకుని మోసాలకు తెర తీసింది.
రాజేష్ వద్దనున్న డబ్బులను కాజేసి.. వాటితో రూ.7లక్షల విలువైన స్థలాన్ని కొనుగోలు చేసింది. ఆపై అతడిని వదిలించుకుంది. తనను మోసం చేసిన సౌమ్యపై రాజేష్ కేసు పెట్టంతో అరెస్ట్ అయి జైలు కెళ్లింది. అనంతరం బెయిలుపై బయటకు వచ్చింది. జైలుకెళ్లినా కూడా బుద్దిమారని సౌమ్య.. మళ్లీ మోసాలకు తెరతీసింది. సతీశ్ అనే వ్యక్తిని సౌమ్య రెండో పెళ్లి చేసుకుంది. కొన్ని నెలల కాపురం చేసిన తర్వాత అతడిని కూడా వదిలేసింది. ఇలా ఒకరి తర్వాత ఒకరిగా ఐదుగురిని పెళ్లాడింది. వారందరిని నుంచి లక్షల్లో డబ్బులు కాజేసింది.
అంతేకాదు, రాష్ట్రమంత్రి ఒకరు.. తన కుటుంబానికి అత్యంత సన్నిహితుడని చెబుతూ లక్షల్లో డబ్బులు దండుకుంది. చివరిగా ఓ ఆటోడ్రైవర్ను పెళ్లాడేందుకు సౌమ్య సిద్ధమైంది. విషయం తెలిసుకున్న బాధితులు ఓ ఇంట్లో ఉన్న ఆమెను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.