నిత్యం ఎక్కడో ఒకచోట రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల కారణంగా అనేక మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. తాజాగా ఓ విద్యార్ధి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. హాస్టల్ లో చదువుతున్న ఆ ఇంజనీరింగ్ విద్యార్ధిని.. తన తల్లిదండ్రులను పలకరించేందుకు స్వగ్రామానికి వెళ్లి.. తిరిగి వచ్చే క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. దీంతో ఆ విద్యార్ధిని కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కాకరాపల్లి గ్రామానికి చెందిన కట్టా కాశీ విశ్వనాథం కుమార్తె కట్టా నందిని(21) కాకినాడలోని ప్రగతి ఇంజినీరింగ్ కాలేజిలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతోంది. తన స్నేహితురాలు వసంతతో కలిసి ఆదివారం హాస్టల్ నుంచి స్కూటీపై ఇంటికి స్వగ్రామానికి బయలు దేరింది. తల్లిదండ్రులను పలకరించిన అనంతరం భోజనం చేశారు. కొద్ది సేపు తల్లిదండ్రులతో ముచ్చటించింది. అనంతరం తిరిగి సాయంత్రం స్కూటీపై మళ్లీ కాకినాడ సూరాయపాలెంలోని తన హాస్టల్ కి బయలుదేరింది.
మార్గం మధ్యలో అన్నవరం బైపాస్ సమీపంలో బెండపూడి శివారులో జాతీయ రహదారిపై వీరి స్కూటీ అదుపు తప్పి ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొట్టింది. దీంతో నందిని అక్కడికక్కడే మృతి చెందగా వసంతకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం తుని ఆస్పత్రికి తరలించారు. నందిని మృతితో వారి కుటుంబంలో విషాదం అలుముకుంది. నందిని తల్లిదండ్రులు శోక సముద్రంలో మునిగిపోయారు. వారిని ఓదార్చం ఎవరితరం కాలేదు. మరి. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.