ఆడపిల్ల పుట్టిందని ఆ తల్లిదండ్రులు బాఢపడలేదు. మహాలక్ష్మి జన్మించిందని అపూరూపంగా పెంచుకున్నారు. మంచి నడవడిక, విద్యాబుద్ధులు నేర్పించారు. కుమార్తె డిగ్రీ పూర్తి చేసిన తర్వాత.. మంచి సంబంధం అని భావించి ఎంతో ఘనంగా వివాహం చేశారు. కుమార్తె పెళ్లై పట్టుమని ఏడాది కూడా కాలేదు. బిడ్డ కాపురాన్ని చూసి మురిసిపోవాలనుకున్న ఆ తల్లిదండ్రులకు గుండె పగిలే వార్త తెలిసింది. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తె.. ఆత్మహత్య చేసుకుని మరణించింది. అల్లుడు చేసిన ఘనకార్యం కారణంగానే తమ బిడ్డ మృతి చెందింది అని తెలుసుకుని ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. పెళ్లి చేయకపోతే.. తమ బిడ్డ తమ కళ్ల ముందే ఉండేది కదా అని గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. వారిని ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. ఈ విషాదకర సంఘటన వివరాలు..
కర్ణాటక, హెణ్ణూరు కదిరేనహళ్లిలో నివాసముంటున్న మునిరాజు, దేవమ్మలకు మోనిక అనే కుమార్తె ఉంది. బిడ్డను అల్లారుముద్దుగా పెంచుకున్నారు. డిగ్రీ వరకు చదివించారు. ఈ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో మోనికకు చిక్కబళ్లాపురం నగరం ప్రశాంతనగరలో నివాసం ఉంటున్న భార్గవతో ఘనంగా వివాహం జరిపించారు. కొన్ని నెలల పాటు మోనిక, భార్గవ దంపతులు అన్యోన్యంగానే ఉన్నారు. ఈ క్రమంలో దసరా పండుగ సందర్భంగా.. భార్య మోనికను పుట్టింటికి పంపాడు భార్గవ్. పండుగ అయిపోయి వారం రోజులు గడిచినా ఆమెను తిరిగి కాపురానికి తీసుకెళ్లలేదు.
ఇక లాభం లేదనుకుని.. మోనిక భార్గవ్కు కాల్ చేసి.. తనను తీసుకెళ్లమని అడిగింది. అయినా అతడు పట్టించుకోలేదు. పైగా భార్యను పుట్టింటికి పంపిన తర్వాత.. లవర్తో కలిసి టూర్లకు వెళ్లాడు. అంతటితో ఆగక.. లవర్తో కలిసి ఎంజాయ్ చేస్తోన్న ఫోటోలను భార్య మోనికకు పంపాడు. వాటిని చూసిన ఆమె ఒక్క క్షణం షాక్కు గురయ్యింది. ఎంతో మంచి వాడని నమ్మి.. వివాహం చేసుకుంటే ఇంత దారుణంగా మోసం చేస్తాడా అని కుమిలిపోయింది. ఆ బాధలో అనూహ్య నిర్ణయం తీసుకుంది మోనిక.
భర్త చేసిన పనితో తీవ్రంగా కలత చెందిన మోనిక.. తన ఇంటి పై అంతస్తు గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అంతేకాక.. తాను చనిపోవడానికి కారణం తన భర్త భార్గవే అని సూసైడ్ నోట్ రాసింది. పై అంతస్తులోకి వెళ్లిన కుమార్తె ఎంతకు తిరిగి రాకపోవడంతో.. పైకి వెళ్లి చూసిన తల్లిదండ్రులకు ఫ్యాన్కు వేలాడుతున్న కుమార్తె మృత దేహం కనిపించింది. పెళ్లయ్యి కనీసం ఏడాది కూడా గడవకముందే.. బిడ్డ ఇలా ప్రాణాలు తీసుకోవడం వారు తట్టుకోలేకపోయారు. అల్లారుముద్దుగా పెంచిన బిడ్డను కసాయి వాడి చేతిలో పెట్టామే అని వాపోయారు. ఈ పెళ్లి చేయకుండా ఉండి ఉంటే.. బిడ్డ తమ కళ్ల ముందే ఉండేది కదా అని గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. తమ బిడ్డ మృతికి కారణమైన భార్గవ్ను కఠినంగా శిక్షించాలని వేడుకుంటున్నారు. ఈ సంఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది.