డాక్టర్లను దేవుడితో పోలుస్తారు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఒక మనిషి ప్రాణం కాపాడగలిగేది ఒక్క డాక్టరు మాత్రమే కాబట్టి. అందుకే వారిని దేవుళ్లుగా, వైద్య వృత్తిని ఎంతో పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు. అయితే అలాంటి స్థానంలో ఉన్న కొందరు వైద్యులు చేసిన పనికి అప్పుడే పుట్టిన ఓ శిశువు ప్రాణాలు కోల్పోయింది. ముక్కుపచ్చలారని ఆ చిన్నారి ఈ లోకంలోకి వచ్చిన కొన్ని గంటల్లోనే తుదిశ్వాస విడిచింది. గర్భిణికి హెచ్ఐవీ ఉందని వైద్యులు ఎవరూ ఆమెకు వైద్యం చేసేందుకు ముందుకు రాకపోవడంతో ఆరు గంటలపాటు నొప్పులతో విలవిల్లాడింతి. ఆఖరికి సర్జరీ చేసినా కూడా.. ఆలస్యం కావడం వల్ల ఆ బిడ్డ బతకలేదు. ప్రస్తుతం ఈ ఘటన అందరినీ కలచి వేస్తోంది.
వివరాల్లోకి వెళ్తే.. ఈ అమానుష ఘటన ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రం ఫిరోజాబాద్లో జరిగింది. సోమవారం ఫిరోజాబాద్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి ఓ గర్భిణీ నొప్పులతో వచ్చింది. అయితే ఆమెకు హెచ్ఐవీ ఉంది. అందుకని అక్కడున్న వైద్యులు ఎవరూ ఆమెకు వైద్యం చేసేందుకు ముందుకురాలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మధ్యాహ్నం ఆస్పత్రికి తీసుకొస్తే రాత్రి 9.30 గంటలకు ఆమెకు ప్రసవం చేసినట్లు తెలిపారు. అది కూడా చీఫ్ డాక్టర్కు ఫిర్యాదు చేయగా.. ఆమె జోక్యంతో వైద్యం చేసినట్లు చెప్పారు. స్ట్రెచర్పై పడుకుని పురిటినొప్పులతో విలవిల్లాడుతున్నా కూడా ఎవరూ పట్టించుకోలేదని, ఆమెకు వైద్యం చేయలేదని ఆరోపిస్తున్నారు. ముందుగా ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లగా వాళ్లు రూ.20 వేలు అడిగారని.. అంత డబ్బులేక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లామన్నారు. కానీ, వాళ్లు మాత్రం ఇలా బిడ్డ చనిపోయేలా చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
బాధిత కుటుంబంతో కలిసి వచ్చిన జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఎన్టీవో మాట్లాడుతూ.. “నేను ఆ మహిళను మధ్యాహ్నం 3 గంటలకు ఆస్పత్రిలో అడ్మిట్ చేశాను. రాత్రి 9 గంటల వరకు ఆమెను ఎవరూ ముట్టుకోలేదు. వైద్యం చేయడం గానీ, ఏవైనా పరీక్షలు చేయడం కూడా చేయలేదు. ఆమె స్ట్రెచర్పై నొప్పులతో అల్లాడుతున్నా కూడా ఎవరూ ఆమెను పట్టించుకోలేదు” అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఆస్పత్రి ఇంఛార్చ్ వాదన మరోలా ఉంది. గర్భిణీకి ఎయిడ్స్ ఉందనే విషయమే తమకు చెప్పలేదని.. సాధారణంగానే ఆమెకు వైద్యం చేశామని, పరీక్షలు కూడా నిర్వహించామంటూ చెప్పుకొచ్చారు. సాయంత్రం 4 గంటలకు తమకు విషయం తెలిసిందని.. వెంటనే సర్జరీకి ఏర్పాట్లు చేసి డెలివరీ చేశామన్నారు. అయితే ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. ఎవరైనా తప్పుచేసినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
UP के Firozabad में 20 साल की pregnant HIV+ महिला के नवजात बच्चे की हुई मौत..।
बताया जा रहा है कि कई घंटो तक महिला labour pain से तड़पती रही और hospital staff ने उसको हाथ नहीं लगाया।
प्रशासन की गंभीर चूक..? pic.twitter.com/yTcwUjGSSe
— Neharika Sharma (@neharikasharmaa) November 23, 2022