మృత్యువు ఏ రూపంలో ఎక్కడి నుంచి వచ్చి పలకరిస్తుందో చెప్పడం కష్టం. కొన్ని సార్లు మన అజాగ్రత్త వల్ల ప్రమాదాల బారిన పడితే.. చాలా సందర్భాల్లో మాత్రం ఇతరుల పొరపాటు వల్ల మనం ప్రమాదంలో చిక్కుకుంటాం.. ఒక్కోసారి ప్రాణాలే కోల్పోతాం. మరీ ముఖ్యంగా అతి వేగం వల్ల ఎంత మంది బలయ్యారో లెక్కేలేదు. ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఎన్ని కఠిన చట్టాలు చేసినా.. ఫలితం లేకుండా పోతుంది. తాజాగా అతి వేగం కారణంగా ఇద్దరు మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మృతి చెందారు. మరణించిన వారిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన యువతి కూడా ఉంది. ఈ విషాదకర సంఘటన చెన్నైలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఆ వివరాలు..
చెన్నైలోని ఐటీ కారియడార్లో ఇద్దరు మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు.. విధులు ముగించుకుని.. ఇంటికి బయలు దేరారు. ఈ క్రమంలో చెన్నైలోని ఓఎంఆర్ వద్ద గంటకు 130 కిలోమీటర్ల వేగంతో దూసుకువచ్చిన కారు.. అదుపుతప్పి వారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ యువతి స్పాట్లోనే మృతి చెందగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేశారు.
ఇక మృతి చెందిన వారిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన యువతి ఉన్నట్లు గుర్తించారు. చిత్తూరు జ్లిలా, తిరుపతికి చెందిన ఎస్. లావణ్య(24) కాగా మరో యువతిని కేరళ పాలక్కడ్కు చెందిన ఆర్ శ్రీలక్ష్మి(23)గా గుర్తించారు. వీరిద్దరూ హెచ్సీఎల్ స్ట్రీట్ సర్వీస్లో ఎనలిస్ట్లుగా పని చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక ప్రమాదానికి కారణమైన డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఉద్యోగాల్లో స్థిరపడి.. ఉజ్వల భవిష్యత్తు గురించి కలలు కంటున్న యువతులు.. ఇలా అర్ధాంతరంగా కన్ను మూయడంతో.. వారి కుటుంబాల్లో తీవ్ర విషాదకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దారుణ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.