నమ్మేవాడుంటే.. కుక్కను చూపించి.. నక్క అని నమ్మించే సమాజం ఇది. ఇలాంటి సమాజంలో.. దొంగ బాబాలు, స్వామీజీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బండ్లు ఓడలు చేస్తాం.. ఓడలు బండ్లు చేస్తాం.. అని నమ్మిస్తారు. అలాంటి బాబా మాటలు నమ్మి కటకటలపాలైయ్యారు దొంగ నోట్లు తరలించే ముఠా. రద్దైన కరెన్సీ నోట్లను ఓ బాబా కొత్త కరెన్సీ నోట్లుగా మారుస్తానంటే నమ్మింది ఓ గ్యాంగ్. పక్కా పథకం ప్రకారం.. దొంగ నోట్లను, రద్దైన పాత నోట్లను తరలిస్తున్న క్రమంలోనే వారి ప్లాన్ ను పోలీసులు భగ్నం చేసి వారిని అరెస్టు చేశారు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
ములుగు ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్ తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా కేశవాపూర్ నివాసి అయిన పప్పుల నాగేంద్రబాబు, కోదాడ తాలుకు సాలర్జింగ్ పేటకు చెందిన నాగలింగేశ్వర్ రావు ఇద్దరు స్నేహితులు. నాగేంద్రబాబుకు వ్యాపారంలో నష్టాలు వచ్చి అప్పులు ఎక్కువయ్యాయి. దాంతో తక్కువ కాలంలో, తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభం పొందాలని అనుకున్నాడు. దానికి ఏదైన ఉపాయం చెప్పాలని స్నేహితుడు నాగలింగేశ్వర్ ను కలిశాడు. అతడు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఒక బాబా పాత కరెన్సీ నోట్లను, కొత్త నోట్లగా మారుస్తాడని చెప్పాడు. ఆ మాటలు నమ్మిన నాగేంద్ర బాబు.. హైద్రాబాద్ కు చెందిన నవీన్ రెడ్డి, వెంకట్ రెడ్డికి రూ.5 లక్షలు ఇచ్చి వారి నుంచి దాదాపు రూ. 2 కోట్ల విలువైన రద్దు అయిన పాత కరెన్సీ, దొంగ నోట్లను కొన్నాడు.
ఇక మిగిలింది ఈ నోట్లను ఆ బాబా దగ్గరికి చేర్చడమే. ఈ డబ్బును భద్రాచలం వయా వెంకటాపురం మీదుగా హైద్రాబాద్ తరలిస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసు తనిఖీల్లో భాగంగా ఈ ముఠా ములుగు పోలీసులకు పట్టుబడింది. ఈ ముఠాకు చెందిన నాగేంద్రబాబు, నాగలింగేశ్వర్ రావ్, సాంబశివ రావు, బెజ్జంకి సత్యనారయణ, వడ్డి శివరాజ్, ఆయుర్వేద డక్టార్ గంటా యాదగిరి, అజయ్ సింగ్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రానికి చెందిన ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సుమారు రూ. 1.65 కోట్ల విలువైన దొంగ నోట్లు, రద్దు అయిన పాత నోట్లను స్వాధీనం చేసుకున్నారు. వారి నుంచి రూ. 5వేల నగదు, రెండు కార్లు, 9 ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.