ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో జనం ఎవరూ కూడా బయటకి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఏపీలో అయితే వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని వాతావరణ శాఖ కూడా హెచ్చరించించి. అయితే ఇంత విపత్కర పరిస్థితుల్లో కూడా ఒక యువతి సాహసం చేసింది. పీకల్లోతు వరద నీటిలో నడుచుకుంటూ మరీ విజయనగరం నుండి విశాఖపట్నం బయలుదేరింది.
వివరాల్లోకి వెళ్తే.. విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం, మర్రివలస గ్రామానికి చెందిన తడ్డి కళావతి అనే యువతి విశాఖలో పరీక్షకు హాజరయ్యేందుకు ఓ పెద్ద సాహసమే చేసింది. భారీ వర్షాల కారణంగా చిత్రావతి నదిలో వరద నీరు చేరడంతో.. ఆ గ్రామానికి బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఎవరూ బయటకు వచ్చే సాహసం చేయలేకపోతున్నారు. అలాంటిది తడ్డి కళావతి అనే యువతి మాత్రం పరీక్ష రాయడం కోసం ఇల్లు దాటి బయటకు వచ్చింది. తనకు పరీక్ష ఉండడంతో పరీక్షకు ఖచ్చితంగా హాజరవ్వాలని నిర్ణయించుకుంది.
విశాఖలో పరీక్షకు హాజరు కావాలంటే… నది దాటక తప్పదు. దీంతో సోదరుల సహకారంతో వారి భుజాలపై నదిని దాటి.. అక్కడి నుంచి మరో వాహనంలో విశాఖ చేరుకొంది. అత్యంత ప్రమాదకరమని తెలిసినా కూడా ఆ యువతి, తన సోదరులతో కలిసి చేసిన సాహసం మెచ్చుకోతగ్గది. వర్షం పడితే స్కూల్ మానేసే విద్యార్థులున్న ఈరోజుల్లో పరీక్ష కోసం ప్రాణాలకు తెగించి సాహసం చేయడం అంటే మామూలు విషయం కాదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఈ యువతి చేసిన సాహసంపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.