తిరుమల దివ్య దర్శనం టోకెన్లకు సంబంధించి టీటీడీ కీలకమైన అప్డేట్ ఇచింది. ఇకపై ఈ టికెట్లకు సంబంధించిన మార్పులను గమనించాలని భక్తులకు టీటీడీ సూచించింది.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక. దివ్యదర్శనం టికెట్ల కేటాయింపులో టీటీడీ పలు మార్పులు చేసింది. నిన్నటి వరకు అలిపిరి నుంచి కాలినడకన కొండ మీదకు వచ్చే భక్తులకు గాలి గోపురం వద్ద దివ్య దర్శనం టికెట్లు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు దివ్యదర్శన టోకెన్ల జారీ కేంద్రాన్ని గాలి గోపురం దగ్గర నుంచి మార్చారు. ఈ టికెట్లను శుక్రవారం నుంచి అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో భక్తులకు టీటీడీ జారీ చేయనుంది. టోకెన్లను పొందిన భక్తులు అలిపిరి కాలినడక మార్గంలోని గాలిగోపురం వద్ద ఉన్న కేంద్రంలో వాటిని స్కాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ భక్తులు తమ టికెట్లను స్కాన్ చేసుకోకపోయినా, ఇతర మార్గాల్లో తిరుమల కొండ పైకి చేరుకున్నా.. స్వామివారి దర్శనానికి అనుమతించరు.
మరో కాలినడక మార్గం అయిన శ్రీవారి మెట్టు మార్గంలో భక్తులకు జారీ చేస్తున్న దివ్యదర్శన టోకెన్లను మాత్రం అక్కడే ఇస్తారు. అంటే ఈ మార్గంలో వెళ్లే భక్తులకు యథాప్రకారం దివ్యదర్శనం టోకెన్లను 1240వ మెట్టు దగ్గర ఇస్తారు. కాగా, అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ఇప్పటివరకు జారీ చేస్తున్న టైమ్ స్లాట్ సర్వదర్శన టోకెన్ల (ఎస్ఎస్డీ) కేంద్రాన్ని విష్ణునివాసం యాత్రికుల వసతి సముదాయానికి టీటీడీ మార్చింది. ఇక వెహికిల్స్లో తిరుమలకు చేరుకోవాలనుకునే భక్తుల కోసం.. తిరుపతిలోనే స్వామి దర్శనానికి ఎస్ఎస్డీ టోకెన్స్ జారీ చేస్తామని టీటీడీ తెలిపింది. శ్రీనివాసపురం, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, విష్ణునివాసం, రైల్వేస్టేషన్ ఎదురుగా, గోవిందరాజసత్రాలు, తిరుపతి రైల్వే స్టేషన్ వెనకాల ఎస్ఎస్డీ టోకెన్స్ను తీసుకోవచ్చని టీటీడీ పేర్కొంది.