ఇటీవల జరిగిన ఏపీ వర్షకాల అసెంబ్లీ సమావేశంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు బిల్లుకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వం యూనివర్సిటీ పేరు మార్చడాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు, ఎన్టీఆర్ కుటుంబసభ్యులు వ్యతిరేకిస్తున్నారు. ఈ అంశంపై నందమూరి వారసులు ఒక్కొక్కరిగా స్పందిస్తూ వస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ పేరు మార్చడాన్ని తప్పుబట్టారు. ఇదే అంశంపై నందమూరి బాలకృష్ణ ఘాటుగా స్పందించారు. యూనివర్సిటీ పేరు మార్పు అంశాన్ని నందమూరి బాలకృష్ణ ఖండించారు. మార్చేయాలి, తీసేయాలి అనుకోవడానికి ఎన్టీఆర్ అనేది పేరు కాదు.. సంస్కృతి అంటూ బాలకృష్ణ ఫైర్ అయ్యారు. అయితే తాజాగా బాలకృష్ణ వ్యాఖ్యలపై రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ స్పందించారు.
ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిందేవరు? ఎన్టీఆర్ ను ప్రజలకు దూరం చేసిందెవరు? అంటూ మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు. శనివారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. ” ఆనాడు మీ తండ్రికి చంద్రబాబు వెన్నుపోటు పొడిస్తే ఎందుకు ప్రశ్నించలేదు?. బాబు పార్టీ లాక్కునప్పుడు బాలకృష్ణ నవ్వుతూ నిలబడలేదా? మీ కుటుంబంలో చంద్రబాబు పెట్టిన చిచ్చు మర్చిపోయావా బాలకృష్ణా? చంద్రబాబు చేసిన ద్రోహంపై ఏరోజైనా మాట్లాడారా? ఎన్టీఆర్ పేరును ఓ జిల్లాకు పెట్టిన ఘనత సీఎం జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుంది. బాబు అధికారంలో ఉన్నప్పుడు ఏరోజైనా ఎన్టీఆర్ గురించి ఆలోచించారా? మరి.. యూనివర్సిటీ పేరు మార్చే బిల్లు అసెంబ్లీకి వచ్చినప్పుడు వచ్చి ఎందుకు మాట్లాడలేదు?.
ఎంగిలి మెతుకుల కోసం చంద్రబాబు పంచన చేరిన మీరు.. జగన్ మోహన్ రెడ్డి గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. ఆరోగ్య యూనివర్సిటీ అనేది చాలా చిన్న అంశం.. జిల్లాకు ఎన్టీఆర్ పేరు చిరస్థాయిగా ఉండే అంశం. జిల్లాకు పేరు పెట్టినప్పుడు కృతజ్ఞత చెప్పలేదు’ అని బాలకృష్ణపై మంత్రి జోగి రమేష్ ఘాటు విమర్శలు చేశారు. పౌరుషముంటే చంద్రబాబును నిలదీయాలని డిమాండ్ చేశారు. నందమూరి ఫ్యామిలీ కేరాఫ్ అడ్రస్ నారా గా మారిందని ఎద్దేవా చేశారు. పునర్జన్మ ఇచ్చిన వైఎస్సార్కు బాలయ్య రుణపడి ఉండాలని మంత్రి సూచించారు. మరి.. మంత్రి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.