విజయవాడ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వివాదం ఏపీలో ఎంతటి వివాదాన్ని రాజేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక అయిన స్వర్గీయ నందమూరి తారక రామరావు అంటే సీఎం జగన్, వైసీపీ నేతలకు ఏమాత్రం గౌరవం లేదని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఇక టీడీపీ నేతలయితే.. ఎన్టీఆర్ని స్మరించుకునేది.. గౌరవించేది తమ పార్టీ మాత్రమే అని ప్రచారం చేసుకుంటున్నారు. దీనిపై యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మండిపడ్డారు. టీడీపీ నేతలకు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకి ఎన్టీఆర్ అంటే వీసమెత్తు గౌరవం లేదని తేల్చి చెప్పారు. అలానే వైఎస్ జగన్మోహన్రెడ్డికి.. ఆయన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డికి ఎన్టీఆర్ అంటే ఎంత గౌరవం, అభిమానమో వివరించారు. ఈ సందర్భంగా గతంలో 2008లో జరిగిన ఓ సంఘటన గురించి వెల్లడించారు.
ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ.. ‘‘తెలుగు గంగ ప్రాజెక్ట్కు ఎన్టీఆర్ పేరు పెట్టింది వైఎస్ రాజశేఖర్రెడ్డి. 2008, నవంబర్లో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. వైఎస్సార్ నిర్ణయంతో అధికారులు విస్తు పోయారు. అది గమనించిన వైస్సార్.. ‘‘ఇందులో ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏం లేదు. తెలుగు గంగ ప్రాజెక్ట్ రావడానికి మూలకారణం ఎన్టీఆర్. ఆయన చొరవ, ప్రయత్నం, కృషి వల్లే తెలుగుగంగ ప్రాజెక్ట్ సాకారం అయ్యింది. పాతికేళ్ల క్రితం ఆయన ధైర్యంగా చేపట్టిన ప్రాజెక్ట్ నేడు ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపింది. అందుకే ఆ ప్రాజెక్ట్కు ఎన్టీఆర్ పేరు పెట్టడమే సబబు. తెలుగు గంగ రూపశిల్పి ఎన్టీఆర్. అందుకే ఆయన పేరు పెట్టాం’’ అని రాజశేఖర్రెడ్డి వెల్లడించారు’’ అని యార్లగడ్డ చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ అంటే వైఎస్సార్కు ఎంతో గౌరవం అని.. అందుకు నిదర్శనం ఈ సంఘటనే అని యార్లగడ్డ తెలిపారు.
ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో భారీ ఎత్తున సాగునీటి ప్రాజెక్ట్లను ప్రారంభించారు. ఈ క్రమంలోనే కరువుప్రాంతం అయిన రాయలసీమను సస్యశ్యామలం చేయడానికి ఆయన తెలుగు గంగ ప్రాజెక్ట్ను ప్రారంభించారు. తొలుత ఈ ప్రాజెక్ట్ను కేవలం చెన్నై నగరానికి తాగు నీటి అవసరాలను తీర్చడం కోసం కృష్ణ జలాలను తరలించే ఉద్దేశంతో ఏర్పాటు చేశారు. 1950 నాటి ఈ ప్రాజెక్ట్.. పలు కారణాల వల్ల ముందుకు రాలేదు. తిరిగి 1971-1983 వరకు రకరకాల ఒప్పందాలు, వివాదాలతో తమిళనాడు, కర్ణాటక, ఏపీ రాష్ట్రాల మధ్య ఈ ప్రాజెక్ట్ నలుగుతూ వచ్చింది. ప్రారంభంలో ఈ ప్రాజెక్ట్లో ఏపీ ప్రయోజనాలను చేర్చలేదు. కానీ ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చాక.. ప్రాజెక్ట్ పేరును తెలుగు గంగగా మార్చడమే కాక.. రాయలసీమకు సాగునీరు అందించే ప్రయోజనాలను చేర్చారు. దాన్ని సాకారం చేశారు. ఆ గౌరవంతోనే వైఎస్సార్.. తెలుగుగంగ ప్రాజెక్ట్కు ఎన్టీఆర్ పేరు పెట్టారని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ చెప్పుకొచ్చారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.