ఆన్లైన్ లోన్ యాప్ వేధింపులకు తట్టుకోలేక రాజమహేంద్రవరంలో కొల్లి దుర్గాప్రసాద్, రమ్యలక్ష్మి అనే దంపతులు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ముక్కుపచ్చలారని ఇద్దరు పసి బిడ్డల గురించి కూడా ఆలోచించకుండా ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వెళ్లారంటే.. లోన్ యాప్ నిర్వాహాకులు వారిని ఎంత దారుణంగా ఇబ్బంది పెట్టి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. సకాలంలో డబ్బు చెల్లించకపోవడంతో.. న్యూడ్ ఫోటోలు స్నేహితులకు, బంధువులకు పంపుతామని బెదిరిస్తుండటం.. అప్పు తీసుకున్న విషయాన్ని అందరికి చెప్పడంతో.. పరువు పోయిందని భావించిన దుర్గాప్రసాద్ దంపతులు ఆత్మహత్య చేసుకుని మృతి చెందారు. వారి మరణంతో కుమార్తెలు నాగసాయి(4), లిఖిత(2) అనాథలయ్యారు. చిన్నారుల పరిస్థితి తలుచుకుని ప్రతి ఒక్కరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చలించిపోయారు. ఆ చిన్నారులను ఆదుకుంటానని హామీ ఇచ్చారు. ఆ వివరాలు..
తల్లిదండ్రుల మృతితో అనాథలైన చిన్నారులు నాగసాయి, లిఖితలకు చెరో రూ.5లక్షల సాయం అందించాలని సీఎం జగన్ అధిఆకారులను ఆదేశించారు. వారి సంరక్షణకు తగిన ఏర్పాట్లు చేయాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలతకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాక లోన్ యాప్ ఆగడాలకు అడ్డు కట్టవేసేందుకు ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలకు ఆదేశించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి లేని లోన్యాప్లపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇక చిన్నారుల సంక్షేమం కోసం సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంపై జనాలు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.