మన చుట్టూ కాదు కదా.. కనీసం మన ఇంట్లో కూడా ఏం జరుగుతుందో పట్టించుకునేంత తీరక లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. చిన్న మాట సాయం, ఆర్థిక సాయం చేయాలన్నా.. ఒకటికి పది సార్లు ఆలోచిస్తాం. అలాంటిది.. తన ప్రాణాలు పోతాయని తెలిసి కూడా.. ఇతరులను కాపాడే వారు చాలా తక్కువ. తన ప్రాణాలు పోతాయని తెలిసినా కూడా వేరే వారి ప్రాణాలు కాపాడే వారిని దైవం అనవచ్చు. ఈ కోవకు చెందిన సాహసమే చేశాడు ఓ ఆర్టీసీ బస్ డ్రైవర్. తన సమయస్ఫూర్తి, ధైర్యంతో 36 మంది ప్రాణాలు కాపాడి.. వారి పాలిట దైవంగా నిలిచాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంది. ఘాట్ రోడ్డులో ప్రమాదం జరగబోతుందని ఊహించిన డ్రైవర్.. చాకచక్యంగా ప్రమాదాన్ని తప్పించి.. బస్సులోని ప్రయాణికులను కాపాడి వారి పాలిట ప్రాణదాతగా నిలిచాడు. ఆ వివరాలు..
కాకినాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బుధవారం ఉదయం భద్రాచలం నుంచి కాకినాడ బయలుదేరింది. ఆ సమయంలో బస్సులో డ్రైవర్గా సుబ్బారావు ఉన్నారు. ఈ బస్సు అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి-చింతూరు ఘాట్ రోడ్డుకు బయలుదేరింది. ఇంతలో వాలమూరు దగ్గర బ్రేకులు ఫెయిలయ్యాయి. ప్రమాదం జరగబోతోందని అంచనా వేసిన సుబ్బారావు బస్సులో ఉన్న మరో డ్రైవర్తో పరిస్థితి గురించి చర్చించాడు. అనంతరం వారిద్దరు కలిసి బస్సులో ఉన్న 36 మంది ప్రయాణికులను అప్రమత్తం చేశారు.
ఘాట్ రోడ్డులో రెండు మలుపులు దాటాక.. సమయ స్ఫూర్తితో వ్యవహరించి.. బస్సును రోడ్డు పక్కనే ఉన్న కొండను ఢీకొట్టించారు. ఈ ఘటనలో బస్సు ముందు భాగం తుక్కుతుక్కయ్యింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కాళ్లు అందులోనే ఇరుక్కుపోగా.. ఆరుగురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటనలో డ్రైవర్ సుబ్బారావు క్యాబిన్లోనే ఇరుక్కుపోయి.. 2 గంటల పాటు అక్కడే ఉండిపోయాడు.
సమాచారం అందుకున్న మారేడుమిల్లి పోలీసులు, లారీ యూనియన్ ప్రతినిధులు ఘటనా స్థలానికి వెళ్లి.. లారీతో బస్సును వెనక్కి లాగి.. క్యాబిన్లో చిక్కుకుపోయిన డ్రైవర్ సుబ్బారావుని బస్సులో నుంచి బయటకు లాగారు. అనంతరం గాయపడిన డ్రైవర్, ప్రయాణికులను మారేడుమిల్లిలోని ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ సుబ్బారావు సమయస్ఫూర్తితో చాకచక్యంగా వ్యవహరించి.. తన ప్రాణాలకు తెగించి బస్సుని ఢీకొట్టించకపోతే.. బస్సు ఘాట్ రోడ్డు పక్కన ఉన్న 100 అడుగుల లోయలో పడిపోయేది. తమ అందరి ప్రాణాలు గాల్లో కలిసిపోయేవని తెలిపారు. తన ప్రాణాలు పణంగా పెట్టి.. తమను కాపాడిన డ్రైవర్ సుబ్బారావును అభినందించారు ప్రయాణికులు.