గడిచిన గత పది రోజులుగా దేశంలో ఎక్కడ చూసినా వర్షాలు విస్తృతంగా కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చాలా గ్రామాలకు వాగులు పొంగి, వంతెనలు దెబ్బతిని రాకపోకలు లేకుండా పోయాయి. చాలా గ్రామాలు జల దిగ్భందంలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఓ ఏఎన్ఎం మాత్రం తన విధులు నిర్వర్తించేందుకు ఓ సాహసమే చేసింది. ఆమె చేసిన పనికి సోషల్ మీడియాలో సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్ జిల్లాలోని దౌలతాబాద్ పీహెచ్సీ పరిధి కుదురుముల్ల గ్రామానికి మార్గం లేకుండా పోయింది. దారిలో వర్షం నీరు చేరి వెళ్లేందుకు వీలు లేకుండా పోయింది. అయినా ఈ ఏఎన్ఎం మాత్రం నడుముల లోతు నీళ్లను సైతం లెక్కచేయలేదు. ఆ నీళ్లలోనే ఆ ఊరి ప్రజలకు టీకా వేసేందుకు వెళ్లింది. ఆరోగ్య శాఖ తమ ట్విట్టర్ ఖాతాలో ఆ వీడియో షేర్ చేసింది.
“బాధ్యతాయుతమైన మా హెల్త్ వర్కర్స్ అన్ని అడ్డంకులను దాటుకుని ప్రజల కోసం పాటుపడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లోనూ టీకా వేసేందుకు వెళ్లిన ఏఎన్ఎం అంకిత భావాన్ని అభినందిస్తున్నాం” అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆ ట్వీట్, వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నెటిజన్లు హ్యాట్సాఫ్ మేడమ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ ఏఎన్ఎం చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Our dedicated Health workers look beyond obstacles and working for the people. Appreciate the efforts of ANM traversing through water, at Kudurumulla, of Doulathabad PHC, Vikarabad district on her way to do her job of administering #Covid19 vaccination. pic.twitter.com/PhrAQNoizP
— Office of Minister for Health, Telangana (@TelanganaHealth) July 27, 2022