ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసు పశ్చిమ బెంగాల్లో సంచలనం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో బెంగాల్ విద్యాశాఖ మంత్రి పార్థా ఛటర్జీని అధికారులు అరెస్ట్ చేశారు. ఆయన కుటుంబం, సన్నిహితుల ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో మంత్రి సన్నిహితురాలు, సినీనటి అర్పితా ముఖర్జీ నివాసంలో గత శుక్రవారం ఈడీ జరిపిన సోదాల్లో రూ.21కోట్లు బయటపడగా.. తాజాగా మరోసారి భారీ మొత్తంలో డబ్బు బయటపడటం కలకలం రేపుతోంది. బుధవారం మధ్యాహ్నం నుంచి సోదాలు కొనసాగించిన ఈడీ అధికారులు ఆమె అపార్ట్మెంట్లోని షెల్ఫ్లో నోట్ల కట్టలు గుర్తించినట్టు సమాచారం. వీటిని లెక్కించేందుకు నగదు లెక్కింపు యంత్రాలను తీసుకురావాలని బ్యాంకు అధికారులకు సూచించారు. అయితే, బుధవారం రాత్రి వరకు వాటిని లెక్కించిన అధికారులు.. రూ.20 కోట్ల నగదు, 3 కేజీల బంగారు బిస్కెట్లు.. నగలు ఉన్నట్లు తేల్చారు. కౌంటింగ్ ఇంకా కొనసాగుతోందని చెప్పారు. పూర్తయ్యేసరికి ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.
ఇక ఉపాధ్యాయ నియామక కుంభకోణం వ్యవహారంలో గత శుక్రవారమే అర్పితా ముఖర్జీ ఇంట్లో రూ.21 కోట్ల డబ్బును స్వాధీనం చేసుకున్న అధికారులు.. శనివారం మంత్రి పార్థా ఛటర్జీతో పాటు ఆమెనూ అరెస్టు చేశారు. వీరిద్దరిని ఆగస్టు 3వరకు కోర్టు ఈడీ కస్టడీకి అప్పగించింది. ఇక ఈడీ విచారణ కొనసాగుతున్న వేళ మళ్లీ భారీగా నోట్ల కట్టలు బయటపడటం గమనార్హం. అయితే, గతంలో అధికారులు స్వాధీనం చేసుకున్న రూ.21 కోట్లు ఉపాధ్యాయ నియామక కుంభకోణంలో అక్రమంగా వచ్చిన డబ్బేనని అర్పితా ముఖర్జీ ఈడీ అధికారులకు చెప్పినట్టు తెలుస్తోంది.
ఈ సందర్భంగా అర్పిత అధికారులతో మాట్లాడుతూ.. ‘‘నా ఇంట్లోని ఒక గదిలో పార్థా ఛటర్జీ డబ్బు దాచేవారు. ఆ గదికి మంత్రి, ఆయన మనుషులకు మాత్రమే ప్రవేశం ఉండేది. ప్రతి పదిరోజులలొకసారి ఛటర్జీ మా ఇంటికి వచ్చేవారు. నా ఇంటిని, మరో మహిళ ఇంటిని మినీ బ్యాంకులా ఉపయోగించుకునేవారు. ఆ మహిళ కూడా ఆయనకు సన్నిహితురాలే. ఆ గదిలో ఎంత డబ్బు ఉంచారో మంత్రి ఏనాడు చెప్పలేదు’’ అని అర్పిత విచారణలో వెల్లడించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మరోవైపు, ఈ నేరారోపణలకు సంబంధించిన కీలక పత్రాలను ఈడీ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అర్పిత ఇంట్లో అధికారులు ఒక 40 పేజీల డైరీని స్వాధీనం చేసుకోగా.. దాంట్లో దర్యాప్తునకు అవసరమైన కీలక సమాచారం లభించొచ్చని భావిస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Cash of Rs 27.9 crores in cash, gold, and jewellery worth Rs 4.31 crores has been recovered till now from the residence of Arpita Mukherjee, a close aide of West Bengal Minister Partha Chatterjee: Sources pic.twitter.com/ZWJuccciw8
— ANI (@ANI) July 28, 2022