Covid-19: చిన్న రోగం వచ్చినా గానీ ఒక రోగికి వాడిన సిరంజి మరొక రోగికి వాడరు. అలాంటిది కరోనా టీకాల విషయంలో ఎంత జాగ్రత్త వహించాలి. టీకాలకి కూడా ఒకరికి వేసిన సిరంజితో మరొకరికి టీకా వేయకూడదు. కానీ మరీ ఘోరంగా ఒక్క సిరంజితో 39 మంది విద్యార్థులకు కరోనా టీకాలు వేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లాలో చోటు చేసుకుంది. సాగర్ నగరంలోని జైన్ పబ్లిక్ హయ్యర్ సెకండరీ స్కూల్లో వైద్య అధికారులు బుధవారం కరోనా టీకా శిబిరం నిర్వహించారు. ఇందులో భాగంగా జితేంద్ర అనే వ్యాక్సినేటర్ స్కూల్ విద్యార్థులకు టీకాలు వేశాడు. ఐతే వ్యాక్సిన్ వేసే జితేంద్ర.. కరోనా నిబంధనలు ఉల్లంఘించాడు. ఒక్కో విద్యార్థికి టీకా కోసం ఒక్కో సిరంజి వినియోగించాల్సి ఉండగా.. అందరికీ ఒకే సిరంజితో వ్యాక్సిన్ వేశాడు. విద్యార్థులు గమనించి తల్లిదండ్రులకు చెప్పడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
39 మందికి ఒకే సిరంజితో వ్యాక్సిన్ వేయడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్ వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగి జితేంద్రను నిలదీశారు. ఐతే ఇందులో తన తప్పేమీ లేదని, అధికారులు తనకు ఒక్క సిరంజి మాత్రమే ఇచ్చారని జితేంద్ర తెలిపాడు. ఈ సంఘటనపై జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ సింఘాల్ స్పందించారు. స్కూల్లోని వ్యాక్సినేషన్ శిబిరాన్ని తనిఖీ చేయాల్సిందిగా చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ను ఆదేశించారు. అయితే అధికారులు చేరుకునేలోపే జితేంద్ర అక్కడి నుంచి పరారయ్యాడు. అధికారులు జితేంద్రకు ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో అధికారులు జితేంద్రపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. జిల్లా వ్యాక్సినేషన్ అధికారి డాక్టర్ రాకేష్ రోషన్పై కూడా శాఖాపరమైన దర్యాప్తు చర్యలకు ఆదేశించారు. 9, 10వ తరగతి చదువుతున్న 15 ఏళ్ళు.. ఆపై వయసున్న 39 మంది పిల్లలకి ఒకే సిరంజితో వ్యాక్సిన్ వేసినట్టు హెల్త్ అధికారులు వెల్లడించారు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
Shocking violation of “One needle, one syringe, only one time” protocol in #COVID19 #vaccination, in Sagar a vaccinator vaccinated 30 school children with a single syringe at Jain Public Higher Secondary School @ndtv @ndtvindia pic.twitter.com/d6xekYQSfX
— Anurag Dwary (@Anurag_Dwary) July 27, 2022