టీడీపీ నేత, మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధిపతి నారాయణను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. కొండాపూర్లోని ఆయన నివాసంలో చిత్తూరు జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన్ని చిత్తూరు తరలిస్తన్నారు. నారాయణ సొంత బెంజ్ కారు 8888లోనే ఆయనను చిత్తూరు తీసుకెళ్తున్నారు. అయితే నారాయణను ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఏపీలో పదో తరగతి ప్రశ్న లీకేజీ వ్యవహారం ఎంత దుమారం రేపిందో అందరికీ తెలుసు. రెండు ప్రశ్న పత్రాలు వాట్సాప్ లో ప్రత్యక్షం కావడంతో సీఎం జగన్ సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: ఆంధ్రాని వణికిస్తున్న ‘అసని’ తుఫాను! ‘అసని’ అంటే అర్ధం ఇదే!
ఇటీవల తిరుపతి బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ ‘విపక్షాలు ప్రశ్న పత్రాలు లీక్ చేసేందుకు సహకరిస్తూ తిరిగి ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమం చేపట్టాయి. నారాయణ, చైతన్య సంస్థలు ప్రశ్న పత్రాలను లీక్ చేసి.. దొంగే దొంగ దొంగ అంటూ ప్రభుత్వంపై కుతంత్రాలు చేస్తున్నారు’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే పదో తరగతి ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారంలో నారాయణ విద్యాసంస్థల సిబ్బంది హస్తం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తిరుపతిలోని నారాయణ ఎస్వీ బ్రాంచ్ లో పదో తరగతి ప్రశ్నా పత్రం లీకేజీ వెలుగులోకి వచ్చిందన్నారు. గిరిధర్ అనే ఉద్యోగి పరీక్ష ప్రారంభం అయ్యాక 9.57 నిమిషాల సమయంలో ప్రశ్నా పత్రం లీక్ చేశారన్నారు. కాగా, ఇప్పటికే గిరిధర్ పోలీసులు అదుపులో ఉన్నట్లుగా సమాచారం. ఇప్పుడు పక్కా ఆధారాలతోనే మాజీ మంత్రి నారయణను అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. చిత్తూరు జిల్లా పోలీసులు అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత ఈ పని చేసినట్లు చెబుతున్నారు. టీడీపీ నేత నారాయణను అదుపులోకి తీసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.