ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. వచ్చే ఏడాది విద్యా సంవత్సరం నుంచే దీన్ని అమలు చేయనున్నారు. ఆ వివరాలు..
తెలంగాణ సర్కార్.. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు శుభవార్త చెప్పింది. ఇప్పటికే వారికి ఏడాది అవసరమయ్యే నోట్బుక్స్, ఇతర వాటిని ఉచితంగా అందిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల్లో రక్తహీనత, పోషకాహార లోపాన్ని నివారించేందుకు గాను సర్కారు బడుల్లో చదివే స్టూడెంట్స్కి ఉదయం టిఫిన్ అందజేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. అంతేకాక వచ్చే విద్యాసంవత్సరం అంటే 2023-24 నుంచి దీనిని అమలు చేయాలని భావిస్తున్నారు. ఉదయం 10 నుంచి 11 గంటల సమయంలో విద్యార్థులకు బెల్లం, రాగి జావా కలిపిన బ్రేక్ ఫాస్ట్ అందజేయనున్నారు. ఇదేకాక ఉన్నత పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో భాగంగా తృణధాన్యాలను చేర్చే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు.
ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ అందజేయడం కోసం బెల్లం పౌడర్, రాగి పిండిని పాఠశాలలకు పంపిణీ చేయనున్నారు. మధ్యాహ్న భోజన పథకం కుక్ కమ్ హెల్పర్లు రాగి జావాను తయారుచేసి విద్యార్థులకు అందజేస్తారు. మధ్యాహ్న భోజన పథకం మెనూలో వినూత్నంగా వారంలో ఒకరోజు వెజిటేబుల్ బిర్యానీని అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల్లో ఎక్కువ మంది పిల్లలు ఉదయం పూట ఏమీ తినకుండానే ఖాళీ కడుపుతో స్కూల్కు వస్తుంటారు. దీంతో వారి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నది.
దీన్ని దృష్టిలో పెట్టుకుని.. ప్రభుత్వం.. ఒకటి నుంచి పదోతరగతి వరకు విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు వచ్చే విద్యాసంవత్సరం నుంచి పాఠశాలలోనే వారికి బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలని నిర్ణయించారు. బలవర్ధకమైన బెల్లం కలిపిన రాగిజావను అందించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఇప్పటికే రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని బడుల్లో స్వచ్ఛంద సంస్థలు, ట్రస్ట్ల సహకారంతో విద్యార్థులకు రాగిజావను అందజేస్తున్నారు. మరి ప్రభుత్వ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.