కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్పై తెలంగాణ సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. బడ్జెట్ ఎస్సీ, ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు, దేశ రైతాంగానికి, సామాన్యులకు, పేదలకు, వృత్తి కులాలకు, ఉద్యోగులకు తీవ్ర నిరాశ నిస్పృహలకు గురిచేసిందని విశ్లేషించారు. కేంద్ర ప్రభుత్వం తమ గప్పాలు తామే కొట్టుకున్నాయని, సామాన్యులను పూర్తిగా నిరాశా నిస్పృహలకు గురి చేసిందని అన్నారు. ప్రయోజనం లేని అంశాలపై మసిపూసి మారేడు కాయ చేసిన గోల్ మాల్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టారన్నారు. దశ దిశా నిర్దేశం లేని., పనికి మాలిన, పసలేని నిష్ప్రయోజనకర బడ్జెట్ గా కేసీఆర్ తేల్చారు. కేంద్ర ఆర్థిక మంత్రి చదివి వినిపించిన బడ్జెట్ ప్రసంగం ఆసాంతం డొల్లతనంతో నిండి, మాటల గారడీ చేశారని విమర్శించారు.
ఇది చదవండి : ఏ ఒక్క ఉద్యోగి జీతం నుంచి రికవరీ చేయొద్దు : ఏపీ హైకోర్టు ఆదేశం
వ్యవసాయ రంగాన్ని ఆదుకునే దిశగా కేంద్రం తీసుకున్న చర్యలు శూన్యమని సిఎం అన్నారు. దేశ రైతాంగానికి వ్యవసాయ రంగానికి ఈ బడ్జెట్ ను బిగ్ జీరో అని సీఎం స్పష్టం చేశారు. దేశ చేనేత రంగానికి ఈ బడ్జెట్ సున్నా చుట్టిందన్నారు. నేతన్నలను ఆదుకునేందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు. ఉద్యోగులను చిరు వ్యాపారులను బడ్జెట్ తీవ్ర నిరాశకు గురిచేసిందని.. ఇన్ కం టాక్స్ లో స్లాబ్స్ ను ఏమీ మార్చకపోవడం విచారకరమని సిఎం అన్నారు. ఆదాయపు పన్ను చెల్లింపులో స్లాబుల విధానం కోసం ఆశగా ఎదురు చూస్తున్న ఉద్యోగ వర్గాలు, తదితర పన్ను చెల్లింపుదారులు ఎంతగానో ఎదురు చూసారని , కానీ వారందరి ఆశలమీద కేంద్ర బడ్జెట్ నీళ్లు చల్లిందని అన్నారు.
ఇది చదవండి : Union Budget 2022: ధరలు పెరిగే, తగ్గే వస్తువుల జాబితా ఇదే..!
వైద్యం తదితర ప్రజారోగ్యం, మౌలిక రంగాలను అభివృద్ధి పరడంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరించిందనే విషయం ఈ బడ్జెట్ ద్వారా తేట తెల్లమైందన్నారు. కరోనా నేపథ్యంలో దేశ వైద్య రంగాన్ని అభివృద్ధి పరచడం మౌలిక వసతుల పురోగతికి చర్యలు తీసుకునేందుకు చర్యలు చేపట్టలేదన్నారు. అసలు దేశ ప్రజల ఆరోగ్యం కేంద్రానికి పట్టకపోవడం ఎంతో భాదాకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కష్టకాలంలో హెల్త్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ ను అభివృద్ధి పరుస్తుంటే..ఆ దిశగా కేంద్రానికి సోయి లేకపోవడం విచారకరమ ని సీఎం అన్నారు. మొత్తంగా బడ్జెట్ దేశ ప్రయోజనాలకు ఏ మాత్రం ఉపయోగకరం కాదన్నారు.