తెలంగాణలో పదో తరగతి ఫలితాలు ప్రకటించేందుకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పదవ తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది పరీక్షలకు హాజరైన వారిలో 90 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. గత రెండేళ్లుగా కరోనా కారణంగా విద్యార్థులను నేరుగా పాస్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది మాత్రం పరీక్షలు యథావిథిగా నిర్వహించారు. అయితే విద్యార్థులు ఒత్తిడికి గురికాకూడదనే ఉద్దేశంతో 11 పేపర్ల పరీక్షకు బదులు 6 పేపర్లకు కుదించారు. గతేడాదిలాగే ఈ సారి కూడా అమ్మాయిల హవానే కొనసాగింది. అత్యధికమంది బాలికలే ఉత్తీర్ణత సాధించారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంవత్సరం మే 23 నుంచి జూన్ 1 వరకు పరీక్షలు నిర్వహించారు. ఈ ఏడాది మొత్తం 5,03,579 విద్యార్థులు టెన్త్ పరీక్షలకు హాజరుకాగా 4,53,201 మంది ఉత్తీర్ణత సాధించారు. పరీక్షల్లో పాస్ కాని వారికి విద్యాసంవత్సరం కోల్పోకుండ ఎస్ఎస్సీ బోర్డు సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించనుంది. ఈ ఫలితాలు ప్రకటించిన కొన్ని రోజుల్లోపే సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.విద్యార్థులు ఫలితాలను bse.telangana.gov.in, bseresults.telangana.gov.in ఇతర వెబ్ సైట్లలోనూ చూసుకోవచ్చు.