జులై 11న మంగ్లీ అఫీషియల్ యూట్యూబ్ ఛానెల్ లో ఈ ఏడాది బోనాల సాంగ్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పాటలో ‘మోతెవరి’ అనే పదంపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అమ్మవారి పై తప్పుడు పదాలు ఉపయోగించారని సింగర్ మంగ్లీపై మండిపడుతున్నారు. కొద్ది రోజులుగా దుమారం కొనసాగుతున్నది. ఈ పాటలో వాడిన పదాలపై మీడియా, సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండగా, మొన్న హిందూ సంఘాలు, ఇవాళ బీజేపీ ఎంట్రీతో వివాదం మరింత పెద్దదైంది. ఈ వివాదంపై మంగ్లీ క్లారిటీ ఇచ్చారు.
ఈ పాటలో ఎలాంటి వివాదస్పద పదాలను వాడలేదంటూ తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ద్వారా పేర్కొన్నారు మంగ్లీ. ఈ పాటను ప్రఖ్యాత జానపద పాటల రచయిత పాలమూరు రామస్వామి 25 ఏళ్ళ క్రితమే రచించారని పేర్కొన్న మంగ్లీ పాలమూరు ప్రాంతంలో కోలాటంలో ఈ పాట చాలా ప్రసిద్ది అని తెలిపారు. 2008లో ఈ పాటను ఓ ఆడియో సంస్థవారు సిడీ రూపంలో కూడా విడుదల చేశారని రామస్వామి రాసిన జానపదాలు తనకు చాలా ఇష్టం అని వెల్లడించారు.
ఆయన మీద అభిమానంతో స్వయాన కలిసి ఈ పాటను తీసుకున్నామని ఈ పాట వీడియోలో రామస్వామిగారిని కూడా చిత్రీకరించామని చెప్పుకొచ్చింది మంగ్లీ. 300 జానపదాలతోపాటు గ్రామదేవత మైసమ్మ మీద ఆయన వంద కోలాటం పాటలు రచించారు. ఆ పాటలన్ని నిందాస్తుతిలోనే ఉన్నాయి. గ్రామదేవతల ఒగ్గు కథలు, బైండ్లోల కొలుపులు ఇలా రకరకాల ఆచారాలు ఉన్నాయి.
భక్తిలో కూడా మూఢ భక్తి, వైరి భక్తి అని రకరకాలుగా ఉన్నాయి. అందులో భాగంగానే ఈ పాటను రూపొందించాం రచయిత రామస్వామిగారి అభిప్రాయం ప్రకారం మోతెవరి అంటే గ్రామంలో ‘పెద్ద’ అనే అర్థంలో ఈ పాట సాగుతుంది. ప్రస్తుతం ఆ పదం వ్యతిరేక పదంగా వాడుకలోకి వచ్చిందన్నది వాదన. నిందాస్తుతిలో కోలాటం రూపంలో సాగే ఈ పాటను మాకు తెలిసిన కొంతమంది కళాకారులు,పెద్దల సలహాలు తీసుకుని చిత్రీకరించాము.
ఈ పాటపై విమర్శలు వచ్చినరోజే పాటను మార్చే అవకాశం ఉన్నప్పటికీ, పాట కోసం ప్రాణంపెట్టిన 80 ఏళ్ల వృద్ద రచయిత రామస్వామి గారిని తక్కువ చేయవద్దనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకోలేకపోయానని తెలిపారు. కానీ దీన్ని మరింత వివాదం చేసి ఆయన్ని కూడా కించపరుస్తున్నారని, ఆ పెద్దాయన కుటుంబ సభ్యుల అనుమతితో లిరిక్స్ లో మార్పులు చేశామని తెలిపారు మంగ్లీ.
లేటెస్ట్ గా అప్ డేట్ చేసిన ఈ పాటని ఇక్కడ చూడండి.