రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వినియోగం పెరగడంపై సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనకు కీలక ఆదేశాలు జారీ చేయడమే కాక.. ఈ విషయంలో పోలీసులకు పూర్తి అధికారాలు ఇచ్చారు. ఈ క్రమంలోనే గ్రామాల్లో గంజాయి సాగు నిషేధానికి కేసీఆర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. గ్రామంలో ఎవరు గంజాయి పండించినా.. ఆ సమాచారాన్ని అధికారులకు అందించకపోతే.. ఆ గ్రామానికి ప్రభుత్వం అందిస్తున్న పెట్టుబడి సాయం రైతు బంధు, తదితర సబ్సిడీలు రద్దు చేస్తామని హెచ్చరించారు. అంతేకాక డ్రగ్ ఫ్రీ గ్రామాలకు ప్రత్యేక ఫండ్ తో పాటు ప్రోత్సాహకాలు ఇస్తామని తెలిపారు. గ్రామాల్లో గంజాయి సాగు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత గ్రామాల్లోని ప్రజల మీద కూడా ఉందని సీఎం గుర్తు చేశారు.
ఏదైనా గ్రామంలో 5 సార్లకు మించి గంజాయి దొరికితే ఆ ఊరికి ప్రభుత్వం అన్ని రకాల సబ్సిడీలను రద్దు చేస్తామని సీఎం స్పష్టం చేశారు. ఈ దిశగా గ్రామ సర్పంచులు, మున్సిపల్ ఛైర్మన్లు, కౌన్సిలర్లతో సమావేశం ఏర్పాటు చేసి గ్రామస్తులకు దీనిపై అవగాహన కల్పించాల్సిందిగా సూచించారు. ఇటువంటి చట్ట వ్యతిరేక చర్యల పట్ల గ్రామస్తులంతా అప్రమత్తమై ప్రభుత్వానికి ముందస్తు సమాచారం అందించే దిశగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
ఇది కూడా చదవండి: ఇకపై వారికి రైతు బంధు, రైతు భీమా రద్దు, కేసీఆర్ కీలక నిర్ణయం
తెలంగాణలో గంజాయి, కొకైన్, ఎల్ఎస్డీ వంటి నార్కోటిక్ డ్రగ్స్ వినియోగం ప్రాథమిక స్థాయిలోనే ఉన్నదని, మొగ్గలోనే తుంచి వేయక పోతే, డ్రగ్స్ వినియోగం పెచ్చుమీరితే మనకు అర్థం కాకుండానే మన అభివృద్ధిని పీల్చిపిప్పి చేస్తుందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నడుస్తున్న పబ్బులు, బార్లు సంబంధిత కేంద్రాల్లో డ్రగ్స్ వినియోగం పై దృష్టి సాధించాలని, అలాంటి వాటిని గుర్తించి వెంటనే లైసెన్స్ లు రద్దు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఉన్న పబ్స్ ను గుర్తించాలని, పబ్స్ యజమానులందరినీ పిలిపించి సమావేశం ఏర్పాటు చేసి వారికి ఖచ్చితమైన ఆదేశాలివ్వాలని డీజీపీని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రభుత్వ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.