రోడ్డుపై వెళ్లేటపుడు అంబులెన్స్ సైరన్ వినిపిస్తే చాలు ఎవరు ఏ ఆపదలో ఉన్నారో అని అంబులెన్స్ వెళ్లేందుకు దారిస్తాము. కానీ కొంత మంది డ్రైవర్లు అవసరం లేకున్నా సైరన్ మోగిస్తూ దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. నగరంలో ఓ అంబులెన్సు డ్రైవర్ బజ్జీల కోసం సైరన్ మోతతో వెళ్లాడు. ఆ తరువాత పోలీసుల ఎంట్రీతో షాక్ అయ్యాడు.
అనారోగ్యంతో బాధపడే వారిని, ఆకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యే వారిని ఆసుపత్రికి తరలించేందుకు అంబులెన్సును ఉపయోగిస్తాము. సకాలంలో స్పందించి రోగి ప్రాణాలను కాపాడుటలో ముఖ్య పాత్ర పోషిస్తాయి అంబులెన్సు దాని సిబ్బంది. 24 గంటలు ఎక్కడ ఏ విధమైన ప్రమాదం జరిగినా సమాచారం అందిన వెటనే సైరన్ మోతతో ప్రమాద స్థలానికి పరుగులు పెడతాయి అంబులెన్సులు. బాధితులను అంబులెన్సులోకి తీసుకుని ప్రథమ చికిత్స అందించి సమీపంలోని హాస్పిటల్ కు తరలించడంలో కీలకంగా వ్యవహరిస్తాయి. కానీ కొందరు అంబులెన్స్ డ్రైవర్ల తీరుతో కొత్త సమస్యలు వచ్చిపడుతున్నాయి. అవసరం లేకున్నా సైరన్ మోతతో స్పీడ్ గా వెళ్లి వాహనాదులను, ట్రాఫిక్ పోలీసులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.
హైదరాబాద్ లో ఓ హాస్పిటల్ కు చెందిన అంబులెన్స్ డ్రైవర్ సైరన్ తో వెళ్లి మిర్చిబండి దగ్గర అంబులెన్సును ఆపి ఎంచక్కా బజ్జీలు తింటూ, కూల్ డ్రింక్ తీసుకుంటూ ట్రాఫిక్ పోలీసులకు చిక్కాడు. దీనికి సంబంధించిన వీడియోను రాష్ట్ర డిజిపి అంజనీ కుమార్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనపై డిజిపి ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యవసర సమయాల్లో వినియోగించాల్సిన సైరన్ ను దుర్వినియోగానికి కొందరు డ్రైవర్లు పాల్పడుతున్నారంటూ, అలా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..
నారాయణగూడ కూడలిలో నిన్న రాత్రి ట్రాఫిక్ పోలీస్ విధులు నిర్వహిస్తున్నాడు. ఆ సమయంలో సైరన్ మోతతో అంబులెన్సు వస్తుంది. ఇది గమనించిన ట్రాఫిక్ పోలీస్ మిగతా వాహనాలను ఆపి అంబులెన్సు వెళ్లేందుకు ట్రాఫిక్ క్లియర్ చేశాడు. అలా వేగంగా ముందుకెల్లిన అంబులెన్స్ ఓ మిర్చి బండి దగ్గర ఆగింది. అనుమానం వచ్చిన కానిస్టేబుల్ అక్కడికి వెళ్లి చూడగా డ్రైవర్ కూల్ డ్రింక్ చేతిలో పట్టుకుని ఉన్నాడు. నర్సులేమో బజ్జీలు కొనేందుకు వెళ్లినట్లు గుర్తించాడు. తీరా చూస్తే అసలు అంబులెన్స్ లో పేషెంట్ లేరు. రోగి లేకున్నా సైరన్ వేసుకుని అంత స్పీడుగా ఎందుకు వచ్చావని డ్రైవర్ ను నిలదీశాడు కానిస్టేబుల్. దీనికి సంబంధించిన దృష్యాలను తన మొబైల్ లో చిత్రీకరించాడు. ఆ వీడియోలను డిజిపి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అవసరం లేకున్నా సైరన్ మోగిస్తూ కొంతమంది డ్రైవర్లు దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
#TelanganaPolice urges responsible use of ambulance services, citing misuse of sirens. Genuine emergencies require activating sirens for swift and safe passage. Strict action against abusers is advised.
Together, we can enhance emergency response and community safety. pic.twitter.com/TuRkMeQ3zN
— Anjani Kumar IPS (@Anjanikumar_IPS) July 11, 2023